హైదరాబాద్‎లో 141 వాటర్ ల్యాగింగ్ పాయింట్లు: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్‎లో 141 వాటర్ ల్యాగింగ్ పాయింట్లు: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లపై సర్వే పూర్తైందని, దీనిపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. స్థలాలు లేని వారికి, స్థలాలు ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లు ఎలా ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని తెలిపారు. హైదరాబాద్ ఇంచార్జ్ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‎లో శనివారం (మే 31) హైదరాబాద్ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. సమీక్ష సమావేశానికి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు అద్దంకి, బల్మూరి వెంకట్, దాసోజు శ్రావణ్, ఎమ్మెల్యేలు రాజాసింగ్, కాలేరు వెంకటేశ్, అక్బరుద్దీన్ ఓవైసీ, మాజీద్ హుస్సేన్, నగర మేయర్, డిప్యూటీ మేయర్ హజరయ్యారు.

నగరంలో ఉన్న పలు సమస్యలను మంత్రితో పాటు జీహెచ్ఎంసీ కమీషనర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దృష్టికి MIM, బీజేపీ ప్రజాప్రతినిధులు తీసుకొచ్చారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. రేషన్ ద్వారా ప్రతి వ్యక్తికి ఆరు కిలోల సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పారు. నగరంలో లక్ష యూనిట్లను కొత్తగా చేర్చామని తెలిపారు. రాజీవ్ యువ వికాసానికి నగరంలో లక్షా 25 వేల దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్‎లో రూ.55 కోట్లతో నాలా డీసిల్టింగ్ పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. వర్షా కాలం నేపథ్యంలో జీహెచ్ ఎంసీ తరపున మాన్ సూన్ టీంలు ఎప్పుడు అందుబాటులో ఉంటాయని చెప్పారు. నగరంలో 141 వాటర్ ల్యాగింగ్ పాయింట్లు ఉన్నాయన్నారు. గత పదేళ్లలో తాగునీటి కనెక్షన్లు 8 లక్షలు పెరిగాయని చెప్పారు. 

గ్రేటర్ ప్రజల తాగు నీటి కోసం గోదావరి, కృష్ణా నీటిని తీసుకొస్తున్నామన్నారు. ఎక్కువ వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకుంటున్న వారు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని నోటీసులు జారీ చేశామని తెలిపారు. 300 గజాల్లో ఉన్న ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిధుల సమస్య వేధిస్తున్నా ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నామని అన్నారు. నగరంలో ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అర్హులకు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు. 

హైదరాబాద్ జిల్లా స్థాయి సమావేశం మొత్తం ఫెయిల్యూర్ అని బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. కేవలం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఉందని ఆరోపించారు. గంటలు గంటలు ఆయన ఒక్కడికే మాట్లాడడానికి సమయం ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో నగర సమస్యలపై చర్చ జరగడం లేదని దుయ్యబట్టారు.