
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(GHMC) పరిధిలో 150 సంచార రైతు బజార్లు ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. నిర్ణయించిన ధరలకే మొబైల్ రైతు బజార్లలో కూరగాయలు అమ్మనున్నట్లు చెప్పారు. నగరంలో ఉన్న రైతు బజార్లలో రద్దీ పెరగడంతో కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రైతు బజార్లకు వినియోగదారులు రాకుండా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మొబైల్ రైతు బజార్లలో మాత్రమే తాజా కురగాయాలు కొనుగోలు చేయాలని మేయర్ విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి సహకరించాలని కోరారు.