
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ పట్టణంలోని మహిమాన్విత మహాశక్తి దేవాలయ పంచదశ(15వ) వార్షికోత్సవం ఆదివారం కనులపండువగా జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి వార్షికోత్సవ పూజల్లో పాల్గొన్నారు. విద్యారణ భారతి స్వామి శ్రీలక్ష్మీ గణపతి, శ్రీమహాదుర్గ, శ్రీమహాలక్ష్మి, శ్రీమహాసరస్వతి అమ్మవార్లకు పంచామృతాభిషేకం చేయగా.
అర్చకులు స్వస్తీ పుణ్యహవచనం, గణపతి పూజ, అఖండ దీపారాధనం, సర్వతో భద్ర మండలం, లక్ష్మీ గణపతి హోమం, రుద్ర సహిత చండీ హోమం, పూర్ణాహుతి, మంత్రపుష్పం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యారణ్య భారతి స్వామి మాట్లాడుతూ సనాతన ధర్మం ఒక సమగ్రమైన జీవన విధానమని, దీనిలో సత్యం, ధర్మం , సేవ, త్యాగం, ప్రేమ వంటి సద్గుణాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్ వై.సునీల్ రావు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.