
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు 40కి చేరాయి. కేవలం 12 గంటల్లో 17 కొత్త కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్నటి(సోమవారం) వరకూ రాష్ట్రంలో 23 కేసులు నమోదుగా కాగా ఇవాళ 40కి చేరుకున్నాయి. వీరిలో ఎక్కువ మంది ఢిల్లీలోని మత ప్రార్థనలకు హాజరైన వారు, మక్కాకు వెళ్లి వచ్చిన వారితో కాంటాక్ట్ లో ఉన్న వాళ్లే.
అనంతపురం, లేపాక్షిలో ఇద్దరికి, ప్రకాశం జిల్లాలో ఇద్దరు, గుంటూరులో ఐదుగురికి, కృష్ణా జిల్లాలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీటితో పాటు ప్రకాశం జిల్లా కందుకూరు, చీరాల, కుంకల మర్రి ప్రాంతాల నుంచి ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ఆరుగురికి, తూర్పు గోదావరి జిల్లాలో మదీనా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరందరికి ప్రస్తుతం చికిత్స జరుగుతోందని.. వీరితో కాంటాక్ట్ లో ఉన్న వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారని డైరెక్టరేట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ ఫేర్ విభాగం తెలిపింది.