వరంగల్‌‌ జిల్లాలో 11 సెగ్మెంట్లకు 17 నామినేషన్లు

వరంగల్‌‌ జిల్లాలో 11 సెగ్మెంట్లకు 17 నామినేషన్లు
  •     పాలకుర్తిలో నామినేషన్‌‌ వేసిన ఎర్రబెల్లి దంపతులు
  •     ములుగులో ఇప్పటివరకు ఒకే ఒక్క నామినేషన్‌‌

హనుమకొండ/వరంగల్‌‌, వెలుగు : ఉమ్మడి వరంగల్‌‌ జిల్లా వ్యాప్తంగా సోమవారం 17 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇందులో ఒక్క వర్ధన్నపేట నియోజకవర్గం తప్ప మిగతా అన్ని నియోజకవర్గాలకు నామినేషన్లు వచ్చాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌‌గా జన్ను ప్రమీల, వరంగల్‍ పశ్చిమ నియోజకవర్గంలో ఎంసీపీఐ (యూ) తరఫున గడ్డం నాగార్జున, ధర్మ సమాజ్‌‌ పార్టీ నుంచి కోగిల రూప నామినేషన్‌‌ వేయగా నర్సంపేటలో ఇండిపెండెంట్లుగా బానోత్‍ ప్రేమ్‌‌నాయక్‌‌, సీపీఐ (ఎంఎల్‍) నుంచి మొగిలి ప్రతాప్‌‌రెడ్డి, పరకాలలో ధర్మసమాజ్‌‌ పార్టీ నుంచి పూరెళ్ల రమేశ్, పున్న భాగ్యశ్రీ ఇండిపెండెంట్‌‌గా నామినేషన్‌‌ వేశారు. వర్ధన్నపేటలో సోమవారం ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు.

ములుగులో ఫస్ట్‌‌ నామినేషన్‌‌

ములుగు, వెలుగు :  ములుగు నియోజకవర్గంలో ఇప్పటివరకు ఒకే ఒక్క నామినేషన్‌‌ దాఖలైంది. ములుగు జిల్లా మంగపేట మండలం దొమ్మెడ గ్రామానికి చెందిన మద్దిల వెంకటేశ్వర్లు సోమవారం నామినేషన్‌‌ పేపర్స్‌‌ను రిటర్నింగ్‌‌ ఆఫీసర్‌‌కు అందజేశారు. అలాగే భూపాలపల్లిలో సోమవారం ఒక నామినేషన్‌‌ దాఖలైంది. 

పాలకుర్తిలో మంత్రి దంపతులు

జనగామ, వెలుగు :  జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు దంపతులు నామినేషన్‌‌ వేశారు. వారితో పాటు ధర్మసమాజ్‌‌ పార్టీ తరఫున బూడిద సునిల్‌‌ తన నామినేషన్‌‌ను రిటర్నింగ్‌‌ ఆఫీసర్‌‌కు అందజేశారు. అంతకుముందు మంత్రి దయాకర్‌‌రావు తొర్రూరులోని మజీద్‌‌లో, ఐనవోలులోని మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు, పూజలు నిర్వహించారు. అలాగే ఘన్‌‌పూర్‌‌లో ధర్మసమాజార్‌‌ పార్టీ నుంచి కొట్టే ఏసేబు, జనగామలో ఇండిపెండెంట్‌‌ చెవిటి అర్జున్‌‌ నామినేషన్లు వేశారు. 

మహబూబాద్‌‌ జిల్లాలో మూడు

మహబూబాబాద్, వెలుగు :  మహబూబాబాద్‌‌, డోర్నకల్‌‌ సెగ్మెంట్లకు సోమవారం మూడు నామినేషన్లు వచ్చాయి. మహబూబాబాద్‌‌ నియోజకవర్గంలో బహుజన సమాజ్‌‌వాదీ పార్టీ క్యాండిడేట్‌‌గా నెల్లికుదురు మండలం జామతండాకు చెందిన గుగులోతు శేఖర్‌‌ నామినేషన్‌‌ వేశారు. డోర్నకల్‌‌లో కిసాన్‌‌ పరివార్‌‌ సంస్థ నిర్వాహకుడు భూపాల్‌‌నాయక్‌‌, ఇండిపెండెంట్‌‌గా ఎల్‌‌హెచ్‌‌పీఎస్‌‌ నాయకుడు, సీరోలు మండలం గోపాతండాకు చెందిన భూక్యా బాలాజీనాయక్‌‌ నామినేషన్‌‌ వేశారు. అయితే కిసాన్‌‌ పరివార్‌‌ సంస్థ నిర్వాహకుడు భూపాల్‌‌నాయక్‌‌ 200 మందితో ర్యాలీ నిర్వహిస్తామని పర్మిషన్‌‌ తీసుకొని అంతకుమించి మందిని తీసుకురావడంతో కోడ్‌‌ ఉల్లంఘన కేసు నమోదు చేశారు. 

ప్రతీ కాలమ్‌‌ నింపేలా చూడాలి

కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు : బల్దియా హెడ్‌‌ ఆఫీస్‌‌లో అసెంబ్లీ నామినేషన్‌‌ పేపర్స్‌‌ను సోమవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌‌ ప్రావీణ్య పరిశీలించారు. ఈసీ రూల్స్‌‌ ప్రకారం నామినేషన్ల ప్రక్రియ సరిగ్గా జరిగేలా చూడాలని ఆదేశించారు. నామినేషన్‌‌ పేపర్స్‌‌లోని ప్రతీ కాలమ్‌‌ను ఫిల్‌‌ చేసేలా చూడాలన్నారు. అన్ని వివరాలను పరిశీలించిన తర్వాత నామినేషన్‌‌ పేపర్స్‌‌ను తీసుకోవాలని చెప్పారు. నామినేషన్‌‌ వేసిన తర్వాత రూల్స్‌‌కు సంబంధించిన బుక్‌‌ను అందజేయాలని చెప్పారు. ఆమె వెంట ఆర్‌‌వో షేక్‌‌ రిజ్వాన్‌‌ బాషా ఉన్నారు.