- మోసపోయిన 18 ప్రభుత్వ బ్యాంకులు
- 2,480 కేసులు నమోదు.. ఆర్టీఐతో వెల్లడి
న్యూఢిల్లీ: 31,898.63 కోట్ల రూపాయలు.. ఇదీ 3 నెలల్లో 18 ప్రభుత్వ బ్యాంకులకు కేటుగాళ్లు కుచ్చుటోపీ పెట్టిన మొత్తం. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో బ్యాంకు మోసాలపై 2,480 కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్కు చెందిన చంద్రశేఖర్ గౌర్ అనే స్వచ్ఛంద కార్యకర్త ఆర్టీఐ దరఖాస్తు చేసుకోవడంతో ఆర్బీఐ అధికారి ఈ వివరాలు వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకైన ఎస్బీఐలోనే ఎక్కువ మోసాలు జరిగినట్టు ఆర్టీఐ దరఖాస్తులో తేలింది. 38 శాతం వాటా ఆ బ్యాంకుదే. 1,197 ఫ్రాడ్ కేసులు నమోదు కాగా, రూ.12,012.77 కోట్ల మోసం జరిగింది.
ఎస్బీఐ తర్వాత అలహాబాద్ బ్యాంకు రెండో స్థానంలో నిలిచింది. 381 కేసులతో 2,855.46 కోట్ల మోసం జరిగింది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో 99 మోసం కేసులు నమోదయ్యాయి. రూ.2,526.55 కోట్ల ఫ్రాడ్ జరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడాకు సంబంధించి 75 కేసులు బుక్కవగా, రూ.2,297.05 కోట్ల ఫ్రాడ్ జరిగింది. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్లో 45 కేసులు, రూ.2,133.08 కోట్లు, కెనరా బ్యాంకు 69 కేసుల్లో 2,035.81 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 194 కేసుల్లో రూ.1,982.27 కోట్లు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 31 కేసుల్లో రూ.1,196.19 కోట్ల మోసం జరిగింది. కార్పొరేషన్ బ్యాంకుకు సంబంధించి 16 మోసం కేసులు నమోదైతే, రూ.960.8 కోట్ల ఫ్రాడ్ జరిగింది.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 934.67 కోట్ల రూపాయల మోసం జరిగింది. 46 కేసులు బుక్కయ్యాయి. సిండికేట్ బ్యాంక్ 54 కేసుల్లో రూ.795.75 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ 51 కేసుల్లో రూ.753.37 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా 42 కేసుల్లో రూ.517 కోట్లు, యుకో బ్యాంక్ 34 కేసుల్లో రూ.470.74 కోట్లు మోసపోయాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఆంధ్రా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, పంజాబ్అండ్ సింధ్ బ్యాంకులూ మోసపోయిన జాబితాలో ఉన్నాయి. అయితే, ఆ మోసాలకు సంబంధించిన తీరును మాత్రం ఆర్బీఐ వెల్లడించలేదు. అన్ని కోట్ల రూపాయల మోసం జరిగిందని చెప్పిందే తప్ప, ఆ మోసాల వల్ల బ్యాంకులు ఎంత నష్టపోయాయన్నదీ చెప్పలేదు. ప్రస్తుతం వాటిపైనే రివ్యూ చేస్తున్నామని చెప్పింది.