మిస్ ఇండియా కిరీటం  రాజస్థానీ అమ్మాయికి

మిస్ ఇండియా కిరీటం  రాజస్థానీ అమ్మాయికి
  • మిస్ ఇండియా కిరీటం  రాజస్థానీ అమ్మాయికి
  • కిరీటం గెలుచుకున్న నందినీ గుప్తా
  • ఫస్ట్​ రన్నరప్​గా  ఢిల్లీకి చెందిన  శ్రేయా పూంజా

న్యూఢిల్లీ : ‘మిస్​ ఇండియా  2023’ కిరీటం రాజస్థాన్​లోని కోట నగరానికి చెందిన 19 ఏళ్ల  నందినీ గుప్తాను వరించింది.  మణిపూర్​ రాజధాని ఇంఫాల్​ లో శనివారం జరిగిన 59వ ఫెమినా మిస్​ ఇండియా గ్రాండ్​ ఫైనల్​ఈవెంట్​ఇందుకు వేదికగా నిలిచింది. గతేడాది మిస్​ ఇండియాగా నిలిచిన సినీ శెట్టి..  మిస్​ ఇండియా కిరీటాన్ని నందినీ గుప్తాకు అలంకరించారు. దీంతో త్వరలో జరగబోయే మిస్​ వరల్డ్​ పోటీల్లో ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని నందిని దక్కించుకున్నారు. ఈ మెగా బ్యూటీ కాంటెస్ట్​లో ఢిల్లీకి చెందిన ఎంటర్​ ప్రెన్యూర్​ శ్రేయా పూంజా ఫస్ట్​ రన్నరప్​గా నిలవగా, రెండో రన్నరప్​గా మణిపూర్​కు చెందిన టీవీ యాంకర్​ తౌనావ్​జంస్ట్రెలా లువాంగ్​ నిలిచారు.  

స్ఫూర్తి ప్రదాత.. రతన్​ టాటా 

మిస్​ ఇండియా నందినీ గుప్తా విషయానికి వస్తే ఆమె బిజినెస్​ మేనేజ్ మెంట్​లో డిగ్రీ చేశారు. వ్యాపార దిగ్గజం రతన్​టాటా తనకు స్ఫూర్తి ప్రదాత అని ఆమె చెప్పారు. నటనలో తనకు ఎంతో ఇష్టమైన యాక్టర్​ ప్రియాంకా చోప్రా అని తెలిపారు. రాజస్థాన్​లోని తన స్వస్థలం కోటకు ప్రత్యేకమైన డోరియా చీరలను ప్రమోట్​ చేసేందుకు తనవంతుగా కృషి చేస్తానని నందినీ గుప్తా వెల్లడించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 30 మంది ఫైనల్స్​లో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్​లో జడ్జీలుగా 2002 ఫెమినా మిస్​ ఇండియా యూనివర్స్ నేహా ధూపియా, స్టార్​ కొరియోగ్రాఫర్​ టెరెన్స్​ లూయీస్​, ఫిల్మ్​ డైరెక్టర్ హర్షవర్ధన్​ కులకర్ణి, ప్రముఖ డిజైనర్లు రాకీ స్టార్, నమ్రత జోషిపుర, సరితాదేవి వ్యవహరించారు. అందం, అభినయంతో జడ్జిల నుంచి మార్కులు పొందేందుకు పోటీదారులు ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బాలీవుడ్​ యాక్టర్లు కార్తిక్​ ఆర్యన్​, అనన్య పాండే డ్యాన్స్​ ప్రదర్శనతో అలరించారు. ఈ ఫైనల్ కాంటెస్ట్​ మే 14న ఉదయం 10 గంటలకు కలర్స్​ టీవీలో ప్రసారం కానుంది. కాగా, తెలంగాణకు చెందిన ఊర్మిలా చౌహాన్, ఏపీకి చెందిన గోమతి రెడ్డి కూడా పోటీపడ్డారు.