నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం.. ఎలక్ట్రిక్ వెహికల్కు ఛార్జింగ్ పెడుతుండగా మంటలు

నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం.. ఎలక్ట్రిక్ వెహికల్కు ఛార్జింగ్ పెడుతుండగా మంటలు

నోయిడా: నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం మధ్యాహ్నం నోయిడాలోని మమురా గ్రామంలో ఎలక్ట్రిక్ వాహనాన్ని ఛార్జింగ్ చేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది. గ్రౌండ్-ఫ్లోర్ పార్కింగ్ దగ్గర చెలరేగిన ఈ మంటలు కళ్లు మూసి తెరిచే లోపే దగ్గరలో ఉన్న వాహనాలకు వ్యాపించాయి. బిల్డింగ్ మొత్తం దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ అగ్నిప్రమాదంలో దురదృష్టవశాత్తూ ఇద్దరు మరణించారు.

అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్లో నివసిస్తున్న సుమారు 50 కుటుంబాలను రెస్క్యూ టీం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్స్, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన స్పాట్కు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నోయిడా సెక్టార్ 66లోని ఈ అగ్ని ప్రమాదం జరిగింది.

అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్ను G+4 నిర్మాణంగా పోలీసులు గుర్తించారు. అన్నీ 2BHK ఫ్లాట్లు. ప్రతీ ఫ్లోర్లో ఐదు కుటుంబాలకు పైగా నివసిస్తున్నాయి. అగ్ని ప్రమాదానికి కారణం ఏంటనే విషయంలో పోలీసుల ప్రాథమిక విచారణలో ఏం తేలిందంటే.. ఎలక్ట్రిక్ వాహనాన్ని ఛార్జ్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. 

ఒక్క నిప్పురవ్వ కారణంగా మంటలు అంటుకుని, అవి సమీపంలోని పెట్రోల్ వాహనాలకు వ్యాపించి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫేజ్-3 పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఏమాత్రం నిబంధనలు పాటించని.. బిల్డింగ్ యజమానితో పాటు లీజుదారుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.