హైదరాబాద్లో ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్దేవుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని దుర్గానగర్ చౌరస్తా, శంషాబాద్ వెళ్లే ఓల్డ్ కర్నూల్ రోడ్డులో ఈ ఘోరం జరిగింది. ఆ దారిలో ఒకరు బ్లాంకెట్లు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తుండగా, రోడ్డు పక్కన నిద్రిస్తున్న మరొకరిని జూన్ 20న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గ్రానైట్ రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు.
దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య చేసిన వారి వివరాలు కనుక్కునేందుకు విచారణ ప్రారంభించారు. సీసీ కెమెరాలు, క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.