వేములవాడ గోశాలలో మరో 2 కోడెలు మృతి

వేములవాడ గోశాలలో మరో 2 కోడెలు మృతి
  • 8న కోడెల పంపిణీ

వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్న గోశాలలో అనారోగ్యంతో ఉన్న  మరో రెండు కోడెలు శుక్రవారం చనిపోయాయి. అనారోగ్యానికి గురైన కోడెలకు వారం రోజులుగా -పశువైద్యాధికారులు ట్రీట్‌‌మెంట్‌‌ అందిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా క్యారంటైన్‌‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చికిత్స కారణంగా కోడెలు చాలా వరకు రికవరీ అయ్యాయి. వాటికి -పచ్చిగడ్డితో పాటు దాణా అందిస్తున్నారు. ఇప్పటివరకు 30 కోడెలు చనిపోయాయని, మరో 11 కోడెలు అనారోగ్యంతో ఉన్నాయని, ఇందులో మూడు కోడెల పరిస్థితి సీరియస్‌‌గా ఉందని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్‌‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

8న రాజన్న కోడెల పంపిణీ

తిప్పాపూర్‌‌లోని గోశాలను శుక్రవారం సిరిసిల్ల కలెక్టర్‌‌ సందీప్‌‌కుమార్‌‌ ఝా తనిఖీ చేశారు. అనారోగ్యానికి గురైన కోడెలకు అందిస్తున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు. గోశాల ఆవరణలో పాడైన, నిరుపయోగంగా ఉన్న ఎండు గడ్డిని తొలగించాలని ఆఫీసర్లను ఆదేశించారు. గోశాలలోని కోడెలను -ఈ నెల 8న రైతులకు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. కోడెలు కావాల్సిన రైతులు పట్టాదార్‌‌ పాస్‌‌బుక్‌‌, ఆధార్‌‌ కార్డుతో తహసీల్దార్‌‌, ఆర్డీవో, మున్సిపల్‌‌ ఆఫీసుల్లో గానీ, https://rajannasircilla.telangana.gov.in/ వెబ్‌‌సైట్‌‌లో గానీ అప్లై చేసుకోవాలని సూచించారు.