
- 71,417 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం
- అదనపు భారం పడుతున్నా.. ఉద్యోగుల సంక్షేమమే ముఖ్యం
- భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని పిలుపు
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 2 శాతం డీఏ పెంచింది. ఈ ఏడాది జనవరి నుంచి పెంచిన డీఏ అమల్లోకి వస్తుందని శనివారం (జూన్ 21) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజాభవన్లో ప్రకటించారు. దీంతో 71,417 మంది విద్యుత్ఉద్యోగులు, పెన్షనర్లు, ఆర్టిజన్లకు లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.
గతంలో 14.074 శాతంగా ఉన్న డీఏను 16.018 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ నిర్ణయంతో విద్యుత్ సంస్థలపై నెలకు రూ.11.193 కోట్ల అదనపు భారం పడనుందని, అయినప్పటికీ ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యత అని భట్టి స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా నిలవాలని.. ఇందుకు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నదని ఆయన పేర్కొన్నారు.
పోటీ ప్రపంచంలో విద్యుత్ చాలా కీలకమన్నారు. 2023 మార్చిలో 15 వేల మెగావాట్ల పీక్ డిమాండ్ ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 మార్చిలో 17,162 మెగావాట్లకు పెరిగిందని తెలిపారు. అయినప్పటికీ, ప్రభుత్వం, విద్యుత్ ఉద్యోగుల సమిష్టి కృషితో అంతరాయం లేకుండా సరఫరా చేశామని ఆయన తెలిపారు.
రాబోయే రోజుల్లో పెరగనున్న విద్యుత్ డిమాండ్..
రాబోయే రోజుల్లో విద్యుత్ డిమాండ్ మరింత పెరగనుందని డిప్యూటీ సీఎం తెలిపారు. 2029–30 నాటికి 26,299 మెగావాట్లు, 2034-–35 నాటికి 33,773 మెగావాట్ల డిమాండ్ ఏర్పడుతుందని కేంద్ర ప్రభుత్వ సంస్థ నివేదిక అంచనా వేసిందని ఆయన వివరించారు. రానున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోందని, న్యూ గ్రీన్ ఎనర్జీ పాలసీ-–2025 ద్వారా 2029-–30 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు విద్యుత్ సిబ్బంది సంసిద్ధంగా ఉండాలన్నారు.
ప్రభుత్వం, ఉద్యోగులు ఆదర్శ కుటుంబంగా కలిసి పనిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్, పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ నాయకులు రత్నాకర్, సదానందం, ఎలక్ట్రికల్ ఇంజినీర్స్ అసోసియేషన్ నాయకులు శివాజీ, 1104 యూనియన్ నేత సాయిబాబా, 327 యూనియన్ నాయకులు శ్రీధర్, పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ నాయకుడు బీసీరెడ్డి, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ నాయకుడు శ్యామ్ మనోహర్, 1535 యూనియన్ నాయకులు వజీర్, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకుడు సత్యనారాయణ, టీఆర్వీకేఎస్ యూనియన్ నాయకుడు కరెంటు రావు తదితరులు పాల్గొన్నారు.