
మాస్కో: ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో తటస్థంగా ఉన్నందుకు గల కారణాలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. సోవియట్ యూనియన్, రష్యన్ ఫెడరేషన్ కు చెందిన దాదాపు 20 లక్షల మంది ఇప్పుడు ఇజ్రాయెల్ లో నివసిస్తున్నారని, ఇప్పుడా దేశం రష్యన్ మాట్లాడే దేశమని ఆయన పేర్కొన్నారు. అందుకే ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధంలో ఇరాన్ కు సాయం చేయకుండా తటస్థంగా ఉన్నామని వివరించారు.
మాస్కోలో జరుగుతున్న సెయింట్ పీటర్స్ బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంలో పుతిన్ మాట్లాడారు. రష్యా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా దౌత్య సంబంధాలు ఉన్నప్పటికీ.. ఇజ్రాయెల్లో నివసిస్తున్న రష్యన్లను దృష్టిలో ఉంచుకుని తటస్థంగా ఉంటున్నామని వెల్లడించారు. ‘‘మా మిత్రపక్షాల విషయంలో రష్యా విశ్వసనీయతను విమర్శించే వారు కావాలనే మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అరబ్ దేశాలతో పాటు ఇస్లామిక్ దేశాలతోనూ చాలా కాలంగా రష్యాకు మంచి సంబంధాలు ఉన్నాయి. మా దేశంలోని జనాభాలో 15 శాతం ముస్లింలే. అలాగే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ లోనూ మేము అబ్జర్వర్లుగా ఉన్నాం” అని పుతిన్ పేర్కొన్నారు.
ఉద్రిక్తతలు చల్లార్చేందుకు సాయం చేస్తం..
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు సాయం చేస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్ చీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ హామీ ఇచ్చారు. ఆదివారం రాత్రి మాస్కోకు చేరుకున్న అబ్బాస్.. సోమవారం పుతిన్ తో భేటీ అయ్యారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంపై ఆయనతో చర్చించారు. ఇరాన్ న్యూక్లియర్ కేంద్రాలపై అమెరికా దాడులను ఖండిస్తున్నామని, ఈ విషయంలో రష్యా వైఖరి ఇదేనని పుతిన్ స్పష్టం చేశారు.