హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం వల్ల మిల్లింగ్ వ్యవహారంపై నేటికీ సందిగ్ధం వీడలేదు. 2021–-22 వానాకాలం మిల్లింగ్ గడువు సెప్టెంబరు నెలాఖరుతో ముగిసింది. కానీ ఇప్పటి వరకు మిల్లింగ్ పొడిగింపుపై కేంద్రం నుంచి అనుమతి రాలేదు. ఇథనాల్ ప్రోత్సాహకాలపై నివేదిక ఇస్తే మిల్లింగ్ గడువు పెంచే అవకాశం ఉంది. గత కొన్నాళ్లుగా కేంద్రం రాష్ట్రాన్ని ఇథనాల్ పాలసీపై స్పందించాలని అందుకోసం చేపట్టే చర్యలపై నివేదికివ్వాలని కోరుతోంది. కానీ రాష్ట్ర సర్కారు దీనిపై ఇప్పటి వరకు స్పందించడం లేదు. ఫలితంగా కేంద్రం నుంచి గత వానాకాలం బియ్యం సేకరణపై అనుమతి రానట్లు తెలుస్తోంది. దీంతో గత పది రోజులుగా నిరుడు వానాకాలం కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సేకరణ నిలిచిపోయింది.
19.20 లక్షల టన్నుల బియ్యం పెండింగ్
2021–-22 వానాకాలానికి సంబంధించి రైతుల నుంచి 70.21 లక్షల టన్నుల వడ్లను సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ సేకరించింది. ఈ వడ్లు మిల్లింగ్ చేసి 47.04 లక్షల టన్నుల బియ్యంగా మార్చి ఆరు నెలల్లో ఇవ్వాలని రాష్ట్రంలోని 2,623 మిల్లులను ఆ శాఖ ఆదేశించింది. గత ఏప్రిల్ నెలాఖరు వరకే గడువు ముగిసింది. రాష్ట్రం అభ్యర్థన మేరకు గడువు నెలనెలా పొడిగిస్తూ వస్తున్నారు. అయినా ఇప్పటి వరకు 19.20 లక్షల టన్నుల బియ్యం పెండింగ్లోనే ఉంది. 11 నెలలు గడుస్తున్నా 40 శాతం బియ్యం ఎఫ్సీఐకి అప్పగించలేదు. తాజాగా సెప్టెంబరు నెలాఖరుతో గడువు ముగిసింది. గత పది రోజులుగా ఎక్స్టెన్షన్ రాకపోవడం, రాష్ట్ర సర్కారు స్పందించకపోవడంతో నిరుడు వానాకాలం బియ్యం మిల్లింగ్ ఆగిపోయింది. దీంతో ఏం చేయాలో అర్థంకాక సివిల్ సప్లయ్స్ శాఖ డైలమాలో ఉంది.
బియ్యం గోల్మాల్కు పాల్పడుతన్నారని ఆరోపణలు
రాష్ట్రంలో సివిల్ సప్లయ్స్ శాఖకు చెందిన జిల్లా మేనేజర్లు, మిల్లర్లు కుమ్మక్కై బియ్యం గోల్మాల్కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సర్కారు నుంచి తీసుకున్న వడ్లను మిల్లింగ్ చేసి బియ్యంగా మార్చి ఇవ్వాల్సి ఉండగా వాటిని పక్కదారి పట్టిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా అక్రమాలు జరగకుండా చర్యలు చేపట్టాల్సిన యంత్రాంగం పట్టించుకోవడం లేదు. దీంతో కొందరు అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై బియ్యం గోల్మాల్కు పాల్పడుతున్నారని, వందల లారీల బియ్యం మాయం చేస్తున్నారని తెలుస్తోంది. ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల బియ్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆసిఫాబాద్ ఎంఎల్ఎస్ పాయింట్లో బియ్యం లెక్కల్లో తేడాలు రావడంతో తనిఖీల్లో అక్రమాలు బయటపడ్డాయి. సివిల్ సప్లయ్స్కు అందాల్సిన బియ్యం కాగితాలపై లెక్కలు చూపి ప్రతి నెలా ఒకటి రెండు లారీల్లో బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసి విచారణ చేపట్టినట్లు తెలిసింది.
యాసంగి మిల్లింగ్ 5 శాతమే
త యాసంగిలో సివిల్ సప్లయ్స్ శాఖ రైతుల నుంచి 50.39 లక్షల టన్నుల వడ్లు సేకరించింది. వీటిని మిల్లింగ్ చేసి 33.93 లక్షల టన్నుల బియ్యం ఎఫ్సీఐకి అప్పగించాల్సి ఉంది. యాసంగి మిల్లింగ్ గడువు ఇప్పటికే ముగిసింది. రాష్ట్రం అభ్యర్థన మేరకు ఈ నెలాఖరు వరకు పొడిగించారు. కానీ ఇప్పటి వరకు 1.98 లక్షల టన్నుల బియ్యం మాత్రమే ఎఫ్సీఐకి ఇచ్చింది. అంటే ఇవ్వాల్సిన బియ్యంలో 95 శాతం ఇంకా పెండింగ్లోనే ఉంది. ఇక యాసంగి వడ్లు సేకరించి ఆరు నెలలు దాటినా ఇప్పటి వరకు నూక శాతం తేల్చలేదు. యాసంగిలో ఎక్కువ నూక వస్తుందన్న మిల్లర్ల అభ్యంతరం మేరకు రాష్ట్ర సర్కారు సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ వేసింది. మైసూరుకు చెందిన సంస్థకు మిల్లింగ్ అప్పగించగా టెస్ట్ మిల్లింగ్ చేసింది. అయితే కమిటీ వేసి ఇన్నాళ్లైనా నేటికీ నివేదిక రాలేదు. దీంతో మిల్లింగ్ వ్యవహారం తేలలేదు.