జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ముగియడంతో ఇవాళ( నవంబర్ 9) సాయంత్రం 6 గంటల నుంచి ఆంక్షలు అమల్లో ఉంటాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. నియోజకవర్గం వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. వీటితో పాటు నవంబర్ 9న సాయంత్రం 6 గంటల నుంచి 11 వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అలాగే నవంబర్ 14న కౌంటింగ్ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జూబ్లీహిల్స్ పరిధిలో వైన్స్, బార్లు, పబ్బులు, కల్లుదుకాణాలు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
జూబ్లీహిల్స్ బైపోల్ కు నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా..14 రోజు కౌంటింగ్ జరగనుంది. ఈక్రమంలో పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. జూబ్లీహిల్స్ లో 4 లక్షల ఒక వేయి 365 ఓటర్లు ఉన్నారని చెప్పారు. జూబ్లీహిల్స్ బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నారని..ఓటర్లు ముందుకు వచ్చి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ స్టేషన్లలో 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని చెప్పారు. పోలింగ్ ను డ్రోన్ల ద్వారా పరిశీలిస్తామని చెప్పారు. ఈ సారి 4 బ్యాలెట్ యూనిట్లు వాడుతున్నామని తెలిపారు. పోలింగ్ స్టేషన్ల దగ్గర సీసీ కెమెరాలు అమర్చుతామని తెలిపారు. 2,060 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉండనున్నారని తెలిపారు. 561 కంట్రోల్ యూనిట్లు, 595 వీవీ ప్యాట్స్, 2,394 బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పోలింగ్ స్టేషన్స్ నుంచి వెబ్ కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుందన్నారు. అన్ని పోలింగ్ స్టేషన్స్ దగ్గర హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నవంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుందని తెలిపారు.
పోలింగ్ స్టేషన్ల దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తామని తెలిపారు నగర జాయింట్ సీపీ ఇక్బాల్. ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం బందోబస్తు ఇస్తున్నామని చెప్పారు. సీఐఎస్ఎఫ్ నుంచి 8 కంపెనీల బలగాలు వచ్చాయన్నారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకుని ఓటు పండుగలో పాల్గొనాలని సూచించారు. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం సందర్భంగా మొత్తం 27 రకాల కేసులు నమోదయ్యాయని చెప్పారు .బుక్కైన 27 కేసులను దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 3 కోట్ల 60 లక్షల నగదు పట్టుకున్నామని చెప్పారు.
