జూబ్లీహిల్స్ లో 17 రోజులుగా హోరాహోరీగా సాగిన బైపోల్ ప్రచారం నవంబర్ 9న సాయంత్రం 6 గంటలతో ముగిసింది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ చివరిరోజు భారీ ర్యాలీలు, రోడ్ షోలతో ప్రచారాన్ని ముగించాయి.
ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల నాయకులతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటల తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలు జిల్లాల నుంచి వచ్చిన పార్టీల నాయకులందరూ తిరిగి వెళ్లిపోవాలని ఇప్పటికే సూచనలు చేశారు హైదరాబాద్ సిపి సజ్జనార్. నిబంధనలకు విరుద్ధంగా స్థానికేతరులు జూబ్లీహిల్స్ లో ఉంటే చాట్ట రీత్యా చర్యలు తీసుకోనున్నారు పోలీసులు. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ఓటర్లను ప్రలోభాల గురి చేస్తే కఠిన చర్యలు తీసుకున్నందుకు హైదరాబాద్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో భారీ బద్రతను ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వచ్చే అన్ని మార్గాలలో పోలీస్ భద్రతను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు పోలీసులు .జూబ్లీహిల్స్ పరిధిలో వైన్స్, పబ్బులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది . అక్టోబర్ 13న నోటిఫికేషన్ విడుదలైంది. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత ,బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. నవంబర్ 11న పోలింగ్ జరుగనుండగా.. 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. దాదాపు 4 లక్షల మంది ఓటర్లున్న ఈ హై-ప్రొఫైల్ నియోజకవర్గంలో గెలుపు ప్రతిష్టాత్మకంగా మారడంతో అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు జోరుగా ప్రచారం చేశారు . ఇప్పుడు ప్రచార గడువు ముగియడంతో చివరి అస్త్రంగా పోల్ మేనేజ్మెంట్పై నాయకులు ఫోకస్ పెట్టారు.
పోలింగ్ శాతం పెరిగేనా?
ళఒక్కో పోలింగ్ కేంద్రంలో కనీసం 986 మంది ఓటర్లున్నారు. 1200 మంది ఓటర్లకు పైగా 11 పోలింగ్ కేంద్రాలుండగా అత్యల్పంగా 263 పోలింగ్ స్టేషన్లో 540 మంది ఓటర్లు.. అత్యధికంగా 9 వ నంబర్ పోలింగ్ స్టేషన్లో 1233 మంది ఓటర్లున్నారు. ఇక్కడ ప్రతి ఎన్నికల్లోనూ యాభై శాతానికి కొంచం అటు ఇటుగా పోలింగ్ నమోదవుతోంది. ఈ సారి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అటు రాజకీయ పార్టీలు, ఇటు అధికారులు కృషి చేస్తున్నారు. ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రానికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.
స్కీమ్లతో జనంలోకి కాంగ్రెస్
జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో ఇప్పటికే ఇంటింటి ప్రచారం పూర్తిచేసిన కాంగ్రెస్.. చివరిరోజైన ఆదివారం కూడా ప్రతి గడపకూ వెళ్లింది. ఇందుకోసం మంత్రుల ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి.. రెండేండ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించి ఓట్లు అభ్యర్థించారు. ఈ ఉప ఎన్నికలో గెలవడం ద్వారా ప్రతిపక్షాల విమర్శలకు చెక్పెట్టడంతో పాటు కాంగ్రెస్చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా చేపట్టిన భారీ ప్రాజెక్టులను నిరభ్యంతరంగా ముందుకు తీసుకెళ్లవచ్చనే ఆలోచనలో అధికారపార్టీ ఉంది.
సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారంలోకి దిగి.. వరుసగా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్లో పాల్గొన్నారు. మంత్రులు కూడా ప్రచారంలో భాగస్వాములయ్యారు. వారిలో 13 మందికి నియోజకవర్గంలోని ఒక్కో డివిజన్ బాధ్యతలు అప్పగించగా.. ప్రభుత్వ సంక్షేమ పథకాలైన మహాలక్ష్మి, గృహలక్ష్మి వంటి ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. కాంగ్రెస్ ప్రధానంగా మహిళలు, మైనారిటీలు, బీసీలు, యువత ఓట్లపై ఆశలు పెట్టుకుంది. బీసీ నాయకుడైన నవీన్ యాదవ్ను గెలిపించుకోవడం ద్వారా బీసీ సాధికారతపై తమకున్న చిత్తశుద్ధిని చాటుకోవాలని అధికారపార్టీ భావిస్తున్నది.
