- సిటీలో వరుస చోరీలకు పాల్పడిన బిమ్లా అనే మహిళ
- నేపాల్ బార్డర్లో పట్టివేత
- జూబ్లీహిల్స్లోని నందగిరిహిల్స్ చోరీ కేసులో మరో ఐదుగురు అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నందగిరిహిల్స్లో జరిగిన భారీ చోరీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దొంగతనం వెనక మాస్టర్ మైండ్ నేపాలీ మహిళ బవిసరా కడేల్ అలియాస్ బిమ్లాదేనని పోలీసులు గుర్తించారు. ఆమె ఈ కేసులో ప్రధాన నిందితుడైన జిబాన్ బహదూర్ చంద్ భార్య అని నిర్ధారించారు. బిమ్లానే భర్త జిబాన్తో పాటు మరో బాయ్ఫ్రెండ్తో కలిసి రాబరీ ముఠాను నడిపిస్తోందని తేల్చారు. బిమ్లాతోపాటు రమేశ్ బహదూర్ చంద్, జనక్ కుమార్ బిక్రమ్ షాహి, లలిత్ బహదూర్ చంద్, మదన్ ఖత్రి, బోహర సుశీల నేపాల్ పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నామని, శనివారం కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం చంచల్గూడ జైలు రిమాండ్కు తరలించారు. కాగా, తాజా అరెస్టులతో ఈ కేసులో మొత్తం నిందితుల సంఖ్య 9కి చేరింది.
సంపన్నుల కుటుంబాలే ఆమె టార్గెట్
బిమ్లా వేసిన ప్రణాళికలో భాగంగానే నేపాలి గ్యాంగ్ చోరీకి పాల్పడినట్టు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. ఆమె హైదరాబాద్లోని సంపన్నులను కుటుంబాలనే టార్గెట్ చేసి వరుస దోపిడీలకు పాల్పడుతోందన్నారు. నందగిరిహిల్స్లో వ్యాపారి రవీంద్రకుమార్ శర్మ ఇంట్లో చోరీ కోసం ఆమె.. -మల్కాజిగిరి జిల్లా నిజాంపేటలోని బోహర సుశీల్ ఇంట్లో తన ముఠా సభ్యులతో సమావేశమై స్కెచ్ వేసిందన్నారు. రవీంద్ర ఇంట్లో తన ముఠాలోని ఒకరిని పనిమనిషిగా చేర్చి విలువైన వస్తువుల వివరాలు సేకరించిందన్నారు. ఈ నెల 5న వాచ్మెన్, వంటమనిషికి మత్తుమందు ఇచ్చి..అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత సుమారు రూ.1.3 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలను నేపాలీ సర్వెంట్ గ్యాంగ్ దోచుకెళ్లిందని వివరించారు. ఇదంతా బిమ్లా నేతృత్వంలోనే జరిగిందని చెప్పారు. చోరీ సొత్తు నేపాల్కు తరలించబడుతుందనే సమాచారం రావడంతో ఇండో, నేపాల్ బోర్డర్ ఫోర్స్లను అప్రమత్తం చేశామన్నారు. దాంతో భూపేందర్ షాహీ, కృష్ణ చంద్లు నాలుగు రోజుల క్రితమే పోలీసులకు చిక్కారు. వారిని విచారించగా బిమ్లా, జిబాన్ బహదూర్ చంద్, ఇతరుల వివరాలు బయటపడ్డాయి. చోరీ తర్వాత జిబాన్ నేపాల్కు పారిపోగా..సొత్తు పంపకం పూర్తయ్యాక బిమ్లా కూడా పారిపోయేందుకు ప్లాన్ చేసింది. కానీ , అంతలోనే పోలీసులకు చిక్కింది.
