- 40 బెడ్స్, అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు
- రోజు సుమారు 160 మందికి డయాలిసిస్ చేసే అవకాశం
- గుండె, కిడ్నీ, లివర్ ట్రాన్స్ప్లాంట్ కోసం ఐదు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డిపార్ట్మెంట్లు
- ఈ నెలాఖరు కల్లా ట్రయల్ రన్
హైదరాబాద్, వెలుగు: పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు హైదరాబాద్ సనత్నగర్లో నిర్మిస్తున్న ‘తెలంగాణ ఇన్స్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ (టిమ్స్) పనులు వేగంగా సాగుతున్నాయి. ముఖ్యంగా కిడ్నీ బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ హాస్పిటల్లో మెగా డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్లో సాధారణంగా 10 నుంచి 15 డయాలిసిస్ మెషీన్లు మాత్రమే ఉంటాయి. కానీ టిమ్స్లో ఏకంగా 40 బెడ్లతో (40 డయాలసిస్ మెషీన్లు) భారీ డయాలిసిస్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఒక్కో బెడ్పై రోజుకు మూడు నుంచి నాలుగు షిఫ్ట్లు నడిపినా.. రోజుకు సగటున 160 మంది పేషెంట్లకు డయాలిసిస్ చేయొచ్చు. ఈ సెంటర్లో హైటెక్ ఎక్విప్మెంట్తో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. దీంతో నిమ్స్, గాంధీ హాస్పిటల్స్పై భారం తగ్గడమే కాకుండా, పేషెంట్లకు వెయిటింగ్ తిప్పలు తప్పనున్నాయి.
అన్ని ఆపరేషన్లు ఇక్కడే..
టిమ్స్లో కేవలం డయాలిసిస్ మాత్రమే కాకుండా.. అన్ని రకాల జబ్బులకు స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉండనున్నారు. టిమ్స్ ఆపరేషనల్ ప్లాన్ ప్రకారం.. ఇక్కడ ఐదు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డిపార్ట్మెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో గుండె (కార్డియాక్), కిడ్నీ, లివర్, ఊపిరితిత్తుల ట్రాన్స్ప్లాంట్ చేసేందుకు అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లను రెడీ చేస్తున్నారు. అలాగే ,13 సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్లలో క్యాన్సర్ (అంకాలజీ), నరాల జబ్బులు (న్యూరో), ప్లాస్టిక్ సర్జరీ, గ్యాస్ట్రో వంటి సేవలు సైతం అందనున్నాయి. వీటితో పాటు జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ వంటి 15 బ్రాడ్ స్పెషాలిటీ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి.
ఆన్లైన్లో ట్రీట్మెంట్ వివరాలు
రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 2.80 కోట్ల ఆయుష్మాన్ భారత్ (అభా) రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. అయితే ఈ స్కీమ్ వినియోగం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. ఈ స్కీమ్పై ప్రజలకు అవగాహన లేకపోవడం, నెట్వర్క్ సమస్యలు, సర్వర్ ఇబ్బందులతో డిజిటల్ సేవలకు ఆటంకం కలుగుతోంది. సనత్నగర్ టిమ్స్లో ఈ ఇబ్బందులు తలెత్తకుండా ఆఫీసర్లు పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు. రోగులకు, వారి అటెండెంట్లకు.. ఆయుష్మాన్ భారత్ యాప్ డౌన్ లోడ్ చేయించడం, ఓపీ స్లిప్ జనరేట్ చేయడంపై అవగాహన కల్పించనున్నారు. అలాగే, పేషెంట్ల ప్రిస్క్రిప్షన్లు, రిపోర్టులను యాప్లో అప్లోడ్ చేయడం కోసం ప్రత్యేక డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించనున్నారు. దీని ద్వారా పేషెంట్ హెల్త్ హిస్టరీ మొత్తం ఆన్లైన్లోకి చేరనుంది. దీని ద్వారా తర్వాత ఎప్పుడైనా మరోసారి ఇదే హాస్పిటల్కు వచ్చినా.. వేరే హాస్పిటల్కు వెళ్లినా ట్రీట్మెంట్ వివరాలను ఆన్లైన్ చూడడం ఈజీ కానుంది.
ఉగాది నుంచి వైద్య సేవలు
సుమారు 1000 బెడ్స్తో నిర్మిస్తున్న టిమ్స్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఆక్సిజన్ లైన్లు, సివిల్ వర్క్స్ పూర్తయ్యాయి. మిగిలిన పనులను సైతం ఈ నెల 28 నాటికి పూర్తి చేసి, ట్రయల్ రన్ నిర్వహించాలని ఆఫీసర్లు టార్గెట్గా పెట్టుకున్నారు. ఉగాది నాటికి టిమ్స్లో పూర్తి స్థాయి వైద్యసేవలు ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు. హాస్పిటల్ నిర్వహణ కోసం మొత్తం 1,059 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ రాగా... తొలి విడతలో భాగంగా ఈ నెలాఖరులోగా 100 మంది డాక్టర్లు, ఇతర సిబ్బందిని విధుల్లోకి తీసుకోనున్నారు. మొత్తానికి టిమ్స్ ప్రారంభమైతే డయాలిసిస్ పేషెంట్ల వెయిటింగ్ తిప్పలు తప్పడంతో పాటు స్పెషాలిటీ సేవలన్నీ ఒకే దగ్గర లభించనున్నాయి.
