హ్యామ్ రోడ్లకు 23 శాతం ఎక్సెస్ టెండర్లు..ఫైనాన్షియల్ బిడ్లు  ఓపెన్ చేసిన అధికారులు

హ్యామ్ రోడ్లకు 23 శాతం ఎక్సెస్ టెండర్లు..ఫైనాన్షియల్ బిడ్లు  ఓపెన్ చేసిన అధికారులు
  • ఈ నెల 4న టెక్నికల్​ అవెల్యూషన్​ మీటింగ్
  • ఎన్​హెచ్​ఏఐ, ఇతర రాష్ట్రాల్లో హ్యామ్​ టెండర్ల తీరుపై చర్చ
  • ఆ తర్వాతే టెండర్లు ఖరారు చేయాలని నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ( ఆర్​ అండ్​ బీ) ఆధ్వర్యంలో నిర్మించనున్న హ్యామ్​ రోడ్ల టెండర్లకు సంబంధించిన ఫైనాన్షియల్​ బిడ్లను ఆఫీసర్లు తెరిచారు. టెండర్లు వేసిన కంపెనీలు ఒక్కో ప్యాకేజీలో 15 నుంచి 23 శాతం ఎక్సెస్​ వేసినట్టుగా గుర్తించారు. ఈ టెండర్ల విషయమై ఈ నెల 4న(సోమవారం) టెక్నికల్​ అవెల్యూషన్​ మీటింగ్​ జరగనున్నది. దీనికోసం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్​హెచ్​ఏఐ, ఇతర రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన హ్యామ్ టెండర్లపై చర్చించనున్నారు.

అక్కడ ఎక్సెస్​లో టెండర్లు ఖరారు చేశారా? లేదా? అనే విషయాలపై ఈ మీటింగ్​లో చర్చ జరగనున్నది. ఇందుకుగాను రాష్ట్ర ఆర్​ అండ్​ బీ శాఖ ఆఫీసర్లు ఫైల్​ సిద్దం చేశారు. ఈ మీటింగ్​లో పాల్గొనే ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు ప్రభుత్వం టెండర్లను ఖరారు చేయనున్నట్టు తెలిసింది. 

441 రోడ్లు.. రూ. 13 వేల కోట్ల నిధులు 

రాష్ట్రంలో ఆర్​ అండ్​ బీ శాఖ తరఫున 32 జిల్లాల పరిధిలో రూ.13,006  కోట్లతో 441 రోడ్లను బాగుచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 6,092.37 కి.మీ రోడ్ల నిర్మాణానికి గతేడాది జూన్​ నెలలో జీవో జారీ చేశారు. రూ.200 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు గల పనులను ఒక్కో ప్యాకేజీగా వర్గీకరిస్తూ మొత్తం 34 ప్యాకేజీలుగా పనులను విభజించి గతేడాది అక్టోబర్​ 23న టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లు తమకు ఆర్బీఐ గ్యారంటీ కావాలని కోరడంతో ప్రభుత్వం ఆర్​బీఐ బ్యాంకర్లతో మీటింగ్​లు పెట్టి కాంట్రాక్ట్​ సంస్థలను టెండర్లు వేసేలా చర్యలు తీసుకున్నది.

ఈ ఏడాది ఏప్రిల్​ నెలలో హ్యామ్​ ప్రాజెక్ట్​ ఇంజినీర్లు టెక్నికల్​ బిడ్లను తెరవగా 34 ప్యాకేజీలకు సంబంధించి పనులు దక్కించుకోవడానికి 90కి పైగా కంపెనీలు టెండర్లు వేశాయి. ఒక్కో కంపెనీ మూడు, నాలుగుకుపైగా టెండర్లు దాఖలు చేసినట్టు సర్కారు ఇంజినీర్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా నేషనల్​ హైవే అథారిటీ ఆఫ్​ ఇండియా (ఎన్​హెచ్​ఏఐ), 11 రాష్ట్రాలలో హ్యామ్​ ప్రాజెక్ట్​లో పనిచేసిన అనుభవం ఉన్న కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి.  జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న కంపెనీలు ఈ వర్క్​లు దక్కించుకోవడానికి పోటీ పడ్డాయి. 

15 నుంచి 23 శాతం ఎక్సెస్​ వేసిన కంపెనీలు

ఆర్​ అండ్​ బీ శాఖ ఆఫీసర్లు శుక్రవారం హ్యామ్​ రోడ్ల టెండర్లకు సంబంధించిన టెక్నికల్​ బిడ్లను తెరిచారు. ఒక్కో ప్యాకేజీ వర్క్​కు గానూ ప్రభుత్వం పిలిచిన టెండర్లపై 15 నుంచి 23 శాతం ఎక్సెస్​ వేసినట్టుగా గుర్తించారు. రోడ్ల నిర్మాణానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఎన్​హెచ్​ఏఐతో పాటు 11 రాష్ట్రాలలో విజయవంతంగా చేపట్టిన హైబ్రీడ్ యాన్యుటీ మోడల్​(హ్యామ్​)ను రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా రాష్ట్రంలో ప్రవేశపెట్టింది. హ్యామ్​ ప్రాజెక్ట్​లో పనులు చేపడితే ఒప్పందం ప్రకారం 30 నెలల్లో పనులు కంప్లీట్​ చేసిన సమయంలో వర్క్​ చేసిన సంస్థకు 40 శాతం బిల్లులను మాత్రమే చెల్లిస్తారు. బ్యాలెన్స్​ 60 శాతం నిధుల చెల్లింపుకు 15 ఏండ్ల గడువు పెట్టారు. అది కూడా విడుతల వారీగా చెల్లించనున్నారు. దీంతో చేసిన పనుల బిల్లుల కోసం 15 ఏండ్లు పాటు వేచి చూడాల్సి వస్తుండటంతో  కంపెనీలన్నీ కూడా ఎక్సెస్​ వేసినట్టుగా ఆఫీసర్లు భావిస్తున్నారు. 

ఈ నెల 4న టెక్నికల్​ అవెల్యూషన్​ మీటింగ్

హ్యామ్​ రోడ్ల టెండర్ల ఖరారు చేయడానికి ఈ నెల 4న టెక్నికల్​ అవెల్యూషన్​ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఆర్​ అండ్​ బీ శాఖ ఈఎన్​సీతో పాటు పంచాయతీరాజ్ శాఖ ఈఎన్​సీ, ట్రైబల్​ ఇంజినీరింగ్​ డిపార్ట్​మెంట్​ సీఈ, ఫైనాన్స్​సెక్రటరీలో పాల్గొననున్నారు. ఈ మీటింగ్​లో చర్చించడానికి ఆర్​ అండ్​ బీ శాఖ ఫైల్​ సిద్దం చేసింది. బిహార్, గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర, రాజస్తాన్, తమిళనాడు రాష్ట్రాల్లో హ్యామ్​ విధానంలో ఖరారు చేసిన టెండర్ల వివరాల ఆధారంగా ఫైల్​ రెడీ చేశారు. మీటింగ్​ తర్వాత ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం హ్యామ్​ టెండర్లను ఖరారు చేస్తుందని ఆర్​ అండ్​ బీ శాఖ ఆఫీసర్లు ‘వీ6 వెలుగు’తో చెప్పారు.