ఓ సాదాసీదా ఇంజినీరింగ్ స్టూడెంట్..పెద్ద కల కన్నాడు. అయితే ఆ కల లక్షలు తెచ్చిపెట్టే ఉద్యోగం కోసం కాదు. కోట్లు కురిపించే వ్యాపారాల గురించి అంతకన్నా కాదు. తను కన్న ఆ కలలో నలుగురూ సంతోషంగా ఉండాలన్న ఆశ మాత్రమే అతనిది. ఆ ఆశయంతోనే తన కలని నిజం చేసుకోవడానికి బయల్దేరాడు.. మూడు లక్షల మొక్కలతో ఏకంగా ఒక అడవినే సృష్టించాడు. 23 ఏండ్లకే ఇన్ని లక్షల మొక్కలు నాటిన ఇతని పేరు విశాల్ శ్రీవాత్సవ.
విశాల్ శ్రీవాత్సవ మధ్యప్రదేశ్లో పుట్టాడు. పేద కుటుంబం, తండ్రి లేడు. దాంతో చిన్నప్పట్నించీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తాగడానికి బుక్కెడు నీళ్లు కూడా ఉండేవి కాదు. వాటికోసం వాటర్ ట్యాంక్ వెనుక మైళ్ల తరబడి పరిగెత్తిన రోజులెన్నో. తను ఉంటున్న వీధిలో కటిక చీకటి. వెలుతురు అనేదే ఉండేది కాదు. తన చుట్టూ ఉన్నవాళ్లవి కూడా ఇంచుమించు ఇవే అవస్తలు. దాంతో ఆ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలి అనుకున్నాడు. నీటి కొరత, ఇతర ఎన్విరాన్మెంటల్ ఇష్యూల గురించి రీసెర్చ్ చేశాడు. ‘ప్రయాస్’ అనే ఎన్జీవోతో కలిసి పని చేయడం మొదలుపెట్టాడు.
మియావాకి టెక్నిక్తో..
ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు ఎన్జీవోతో కలిసి గ్వాలియర్ ప్రాంతానికెళ్లాడు విశాల్. అక్కడివాళ్లు మంచినీళ్ల కోసం పడుతున్న కష్టాల్ని చూశాక.. తన చిన్నతనం కళ్లముందుకొచ్చింది. ఆ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి వీలైనన్ని ఎక్కువ మొక్కలు పెంచాలనుకున్నాడు. అలాగే వాటర్ ట్యాంక్స్ ఏర్పాటు చేయడానికి నిధులు సేకరించాడు. మూడేండ్లలో మూడు లక్షల చెట్లు నాటాడు. మరో లక్ష చెట్లు త్వరలో నాటబోతున్నాడు.
మియావాకి టెక్నిక్ ద్వారా మొక్కలు పెంచుతున్నాడు విశాల్. ఈ పద్ధతిలో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు నాటొచ్చు. అదెలాగంటే..చిన్న, పెద్ద, మధ్యరకం.. ఇలా వివిధ సైజ్లున్న మొక్కల్ని పక్కపక్కన నాటతారు. ఒక మొక్క ఎదుగుదల ప్రభావం ఇంకో మొక్కపై పడకుండా ఎత్తు విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటారు. డ్రిప్ పద్ధతిలో నీళ్లు పెడతారు. ఈ జపనీస్ టెక్నిక్తో మొక్కలు 30 రెట్లు ఎక్కువ వేగంగా పెరుగుతాయి కూడా. దాంతో మూడు నుంచి నాలుగేండ్లలో పదిరెట్లు పచ్చదనం పెరుగుతుంది. అందుకే ఈ టెక్నిక్ గురించి తెలియగానే.. ప్రభుత్వ అధికారులని కలిసి, మియావాకి గురించి వివరంగా చెప్పాడు విశాల్. వాళ్లని ఒప్పించి ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాడు. అయితే దీనంతటికి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు విశాల్. కొన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి కూడా పని చేస్తున్నాడు. అలాగే తను ఎంచుకున్న ప్లేస్ని బట్టి ఏ మొక్క నాటాలన్నది డిసైడ్ అవుతాడు. అంటే కొన్ని చోట్ల కేవలం పచ్చదనం కోసం.. ఇంకొన్ని చోట్ల చుట్టుపక్కలున్న పేదవాళ్లకి ఉపాధి చూపించడానికి పండ్ల మొక్కలు నాటతాడు. దీంతో పాటు ఎన్జీవోలతో కలిసి మారుమూల గ్రామాలకి వసతుల్ని కల్పిస్తున్నాడు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా పేద పిల్లల్ని చదివిస్తున్నాడు కూడా.
‘‘వానలు లేక రైతులు పడుతున్న కష్టాలు తెలిసినవే. రోజు రోజుకి కాలుష్యం, నీటి కొరత కూడా పెరిగిపోతోంది. వీటన్నింటికీ సొల్యూషన్గా వీలైనన్ని ఎక్కువ మొక్కలు పెంచాలనుకున్నా. ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే మూడు లక్షల మొక్కలు నాటా. ఇంకో లక్ష మొక్కల పెంపకానికి గ్రౌండ్ లెవల్ వర్క్ చేస్తున్నా. రానున్న రోజుల్లో మరిన్ని మొక్కలు పెంచుతా’’ అంటున్నాడు విశాల్.