కాటేస్తున్న కరెంటు తీగలు.. మానుకోట జిల్లాలో కరెంట్​షాక్​తో ఐదుగురుమృతి

కాటేస్తున్న కరెంటు తీగలు.. మానుకోట జిల్లాలో కరెంట్​షాక్​తో ఐదుగురుమృతి
  • మానుకోట జిల్లాలో ఈఏడాది కరెంట్​షాక్​తో 24 మూగ జీవాలు మృతి
  • ప్రతీ సీజన్​లో ప్రమాదానికి కారణమవుతున్న విద్యుత్​ తీగలు
  • ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్​

మహబూబాబాద్, వెలుగు: ఎండాకాలం ముగిసి వర్షాకాలం సమీపించే ప్రతీ సీజన్​లో విద్యుత్​ ప్రమాదాల కారణంగా ఎంతో మంది ప్రజలు, మూగజీవులు బలవుతున్నాయి. విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్లకు రక్షణ కంచెలు లేకపోవడం, లూజ్ వైరింగ్, ఈదురు గాలుల మూలంగా విద్యుత్​ తీగలు తెగిపడడం, ఐరన్​ పోల్స్, సపోర్ట్​ వైర్లు వర్షాకాలంలో షాక్​కు గురికావడం, ఎల్సీ తీసుకోవడంలో అజాగ్రత్తల మూలంగా జనం, మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి.

వర్షాకాలం వస్తుందంటే వణుకే.. 

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వర్షాకాలం వస్తుందంటే చాలు ప్రజల్లో వణుకు పుడుతోంది. విద్యుత్ ప్రమాదాల కారణంగా జనంతోపాటు, ఎద్దులు, ఆవులు బర్రెలు, గొర్రెలు మృత్యువాత పడుతున్నాయి. కరెంట్​ ఆఫీసర్లు క్రమం తప్పకుండా లూస్ వైర్లను సరి చేస్తున్నామని చెబుతున్నా, అనేక చోట్ల ఈదురు గాలుల కారణంగా స్తంభాలు వంగిపోవడం, విద్యుత్​ వైర్లు తెగిపోవడం, ట్రాన్స్​ఫార్మర్ల వద్ద సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పడం లేదు. జనాల్లోననూ సరైన అవగాహన లేకుండా ట్రాన్స్​ఫార్మర్ ఫీజులు మార్చడం, ఇండ్ల వద్ద దండేలు ఏర్పాటు, తడి బట్టలను ఆరేస్తున్న క్రమంలో రేకుల ఇండ్లలో విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోతున్నారు. 

మే నెలలో పలువురు మృతి.. 

మహబూబాబాద్ జిల్లా మర్రి కుంటతండాలో మే 13న గుగులోతు సాలమ్మ (68) బట్టలు ఆరేస్తూ కరెంట్​ షాక్​ తగిలి మృతి చెందగా, 20న బయ్యారం మండలం కోడిపుంజుల తండాలో ఇస్లావత్​ నరేశ్​(26) కరెంట్​ వైర్లు సరిచేస్తూ విద్యుత్​ షాక్​కు గురై మృతి చెందాడు. మహబూబాబాద్​ పట్టణంలో కార్తీక్​(18) తెగిపడిన కరెంట్​ వైర్లు తగిలి స్పాట్​లోనే చనిపోయాడు. మరో రెండు ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా,  శనివారం పెద్ద వంగర మండలం చిన్నవంగరకు చెందిన వల్లపు అశోక్, జలగం మల్లయ్య బైక్​పై చెర్లపాలెం మీదుగా చీకటయపాలెం గ్రామానికి వెళ్తున్నారు. చర్లపాలెం సమీపంలో కరెంట్​వైర్ తెగిపడడంతో వారికి తగిలి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఎంజీఎంకు తరలించారు.

ఒకే రోజు 8 పశువుల మృత్యువాత

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారంలో మే 28న ఈదురు గాలులు బలంగా వీయడంతో విద్యుత్ హై టెన్షన్ లైన్ విద్యుత్ వైర్లు కిందపడి ఉన్నాయి. మేత కోసం అటుగావచ్చిన 8 పశువులు మృతి చెందడంతో  లక్షల్లో నష్టం వాటిల్లింది. ఇటీవల నారాయణపురంలో విద్యుత్​ షాక్​తో పాడి గేదే మృతి చెందగా, గార్ల, తొర్రూరు, నరసింహులపేట మండలాల్లోనూ పాడి గేదెలు మృత్యువాతపడ్డాయి.

ప్రమాదాల నివారణకు చర్యలు

విద్యుత్ ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఏడాది మే నెల మొదటి వారంలో విద్యుత్ భద్రత వారోత్సవాల్లో భాగంగా జిల్లా, మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వర్షాకాలంలో, బలమైన ఈదురు గాలులు వీస్తున్న సమయంలో విద్యుత్ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ వైర్లు లూజుగా ఉండడం, స్తంభాలు వంగిపోయి కిందికి వాలి ఉండడం గమనిస్తే సమీపంలోని విద్యుత్ అధికారులకు తెలుపాలి. తగిన చర్యలను తీసుకుంటాం.  - నరేష్, ఎస్ఈ, మహబూబాబాద్​ జిల్లా