ఆ సబ్ మెరైన్ వచ్చుంటే అమెరికన్లు.. 25 వేల మంది చనిపోయేటోళ్లు

ఆ సబ్ మెరైన్ వచ్చుంటే అమెరికన్లు.. 25 వేల మంది చనిపోయేటోళ్లు
  • సబ్​మెరైన్​లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారని ట్రంప్​ ఆరోపణ
  • కరేబియన్​ సముద్రంలో దానిని బాంబులతో పేల్చినట్లు వెల్లడి

న్యూయార్క్: కరేబియన్​ సముద్రం నుంచి అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ సబ్​మెరైన్​ను అమెరికా దళాలు బాంబులతో పేల్చేశాయి. అందులో పెద్ద ఎత్తున డ్రగ్స్​ ఉండటంతోనే పేల్చిసినట్లు ప్రకటించాయి. ఘటనలో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారని.. మరో ఇద్దరిని బంధించి వారి సొంత దేశాలైన కొలంబియా, ఈక్వెడార్​కు అప్పగించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తెలిపారు. డ్రగ్స్​ సబ్​మెరైన్​ను ధ్వంసం చేయకపోతే దాని బారినపడి అమెరికాలో 25 వేల మంది చనిపోయేవాళ్లని, వాళ్ల ప్రాణాలను కాపాడామని ఆయన పేర్కొన్నారు. 

సబ్​మెరైన్​పై బాంబులు వేసి పేల్చేస్తున్న దృశ్యాల వీడియోను పెంటగాన్​తన ‘ఎక్స్’​ ఖాతాలో పోస్ట్​ చేసింది. లాటిన్​ అమెరికా దేశాల నుంచి  కరేబియన్​ సముద్రం గుండా కొన్నేండ్లుగా స్మగ్లర్లు డ్రగ్స్​ను తరలిస్తున్నారు. దీన్ని కట్టడి చేసేందుకు తీరం వెంట అమెరికా బలగాలు గస్తీ కాస్తున్నాయి. సెప్టెంబర్​ నుంచి ఇప్పటివరకు వెనెజువెలా తీరంలోనే ఆరు డ్రగ్స్ పడవలను అమెరికా బలగాలు నీట ముంచేశాయి. ‘‘భారీ ఎత్తున డ్రగ్స్​తో అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన సబ్​మెరైన్​ను ధ్వంసం చేయడం నాకు ఆనందంగా ఉంది. ఆ సబ్​మెరైన్​ అమెరికా ఒడ్డుకు చేరుకొని ఉంటే దాని ప్రభావంతో 25 వేల మంది అమెరికన్లు మరణించేవాళ్లు. దాన్ని ధ్వంసం చేయడం ద్వారా వారందరినీ కాపాడాం. 

ఘటనలో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. ఈక్వెడార్​, కొలంబియాకు చెందిన మరో ఇద్దరు టెర్రరిస్టులను పట్టుకొని వారి దేశాలకు అప్పగించాం. కొలంబియాకు ఫండింగ్​ ఆపేశాం” అని తన ట్రూత్​ సోషల్​ మీడియాలో ట్రంప్​ పేర్కొన్నారు. దీన్ని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో కూడా ఎక్స్​ వేదికగా ధ్రువీకరించారు. 

కాగా,  కొలంబియా అధ్యక్షుడు పెట్రో ఓ అక్రమ డ్రగ్ డీలర్ అని ట్రంప్ మండిపడ్డారు. ‘‘ఓవైపు మా దేశం నుంచి పెద్ద ఎత్తున సబ్సిడీలు పొందుతూ, మరోవైపు మా దేశానికి డ్రగ్స్​ను అక్రమంగా చేరవేస్తూ, దీనిని పెట్రో ఓ వ్యాపారంగా మార్చుకున్నాడు. డ్రగ్స్ ఉత్పత్తిని ఆయన వెంటనే ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది” అని పెట్రోను  ట్రంప్ హెచ్చరించారు.