
శ్రీనగర్: దక్షిణ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో 28 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సిబ్బందికి కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయిందని సీనియర్ అధికారులు గురువారం మీడియాకు వెల్లడించారు. ఈ నెల 6 న వైరస్ బారిన పడి 44 ఏళ్ల కానిస్టేబుల్ చనిపోయాడని, అతనితో కలిసిన 75 మంది శాంపిల్స్ టెస్టులకు పంపించగా.. అందులో ఇప్పటివరకు 28 మందికి కరోనా సోకినట్లు తేలిందన్నారు. మరికొంతమంది రిజల్ట్స్ రావాల్సి ఉందన్నారు. బాధితులను ఐసోలేషన్ కు తరలించి, వారందరి కాంటాక్ట్స్ ట్రేస్ చేస్తున్నామని చెప్పారు. సీఆర్పీఎఫ్లో ఇప్పటివరకు 516 మంది వైరస్ బారిన పడగా అందులో 353 మంది సిబ్బంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.