టెక్నీషియన్​ లేక ..2డీ ఎకో మిషన్​ మూలన!

టెక్నీషియన్​ లేక ..2డీ ఎకో  మిషన్​ మూలన!
  •     భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హాస్పిటల్​లో నిరుపయోగం
  •     ఖమ్మం, హైదరాబాద్​వెళ్లలేక ఇబ్బందిపడుతున్న గుండె జబ్బు బాధితులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్​జనరల్​ హాస్పిటల్​లో 2డీ ఎకో మిషన్  మూలన పడింది.  లక్షలు పెట్టి కొన్న మిషన్​ను టెక్నీషియన్​ లేరనే సాకుతో ఏర్పాటు చేయకుండా మూలకే పరిమితం చేశారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా కొత్తగూడెంలోని గవర్నమెంట్​జనరల్ ​హాస్పిటల్​లోని డయాగ్నోస్టిక్​ సెంటర్​లో మొదటి సారిగా 2డీ ఎకో మిషన్​ ఏర్పాటు చేస్తున్నామని గతేడాది అప్పటి హెల్త్​ మినిస్టర్​ హరీశ్​రావు ప్రకటించారు. 2డీ ఎకో మిషన్​తో ఇక గుండె జబ్బు బాధితులు ఖమ్మం, వరంగల్

హైదరాబాద్​ లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని వైద్యాధికారులు చెప్పడంతో జిల్లా ప్రజలు సంబరపడ్డారు.  కానీ నెలలు గడుస్తున్నా మిషన్​ను మూలకు పెట్టారే తప్ప ఏనాడు ఉపయోగించింది లేదు. దాదాపు రూ.40 లక్షలకు పైగా ఖర్చు పెట్టి తెచ్చిన మిషన్​ టెక్నీషియన్​ లేక నిరుపయోగంగా మారింది. మరో వైపు కార్డియాక్​ డాక్టర్​ వస్తారంటూ ఏడాది కాలంగా వైద్యాధికారులు చెబుతున్నారనే తప్ప డాక్టర్​ వచ్చింది మాత్రం లేదు. 

ప్రైవేట్​లో వేలల్లో ఖర్చు.. 

జిల్లాలోని గవర్నమెంట్​ హాస్పిటల్​లో 2డీ ఎకో మిషన్​ లేకపోవడంతో గుండె జబ్బు బాధితులు రూ. వేలకు వేలు వెచ్చించి ప్రైవేట్​ డయాగ్నోస్టిక్​​ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఖమ్మం, హైదరాబాద్​ వెళ్లలేక ఇబ్బంది పడుతున్నామని గుండె జబ్బు బాధితులు ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో  కాంగ్రెస్​ ప్రభుత్వం రావడంతో ఇప్పటికైనా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు 2డీ ఎకో మిషన్​ అందుబాటులోకి తచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.