మందులు కొనడానికి వెళ్లిన యువతిపై హత్యాచారం

మందులు కొనడానికి వెళ్లిన యువతిపై హత్యాచారం

ముజఫర్‌పూర్:  తన తల్లితో కలిసి మెడిసిన్ కొనేందుకు వెళ్లిన ఓ యువతిని కిడ్నాప్ చేసి.. అత్యాచారం చేసి చంపారు. ఈ దారుణ ఘటన బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో జరిగింది. మానియారా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాధేపూర్ గ్రామానికి చెందిన యువతి.. తన తల్లితో కలిసి దగ్గర్లోని మెడికల్ షాపుకు వెళ్లింది. అక్కడికి వచ్చిన ముగ్గురు యువకులు తమ కూతురుని కిడ్నాప్ చేశారని యువతి తల్లి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అయితే పోలీసులు మాత్రం వెంటనే స్పందించలేదని ఆమె వాపోయింది. మరుసటి రోజు కుద్ని గ్రామానికి సమీపంలోని కదాని నదిలో పోలీసులకు ఓ శవం దొరికింది. ఆ శవం ముఖం గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో పోలీసులు శవాన్ని ఆసుపత్రికి తరలించారు. తమ కూతురు కిడ్నాప్ అయిందని కంప్లైంట్ చేసిన తల్లికి పోలీసులు సమాచారమిచ్చారు. ఆస్పత్రికి వచ్చిన తల్లి.. శవానికి ఉన్న బట్టలను చూసి.. చనిపోయింది తమ కూతురేనని గుర్తుపట్టింది. 

తమ ఇంటిముందు దీపక్, రంజిత్ సోనూ, గణేశ్ అనే ముగ్గురు యువకులు బ్లాక్‌లో మందు అమ్ముతూ ఉండేవారని.. వారిమీదే తమకు అనుమానంగా ఉందని యువతి తల్లి పోలీసులకు చెప్పింది. దాంతో పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అయితే నిందితులను అరెస్టు చేస్తే గానీ.. తమ కూతురు అంత్యక్రియలు జరపమని యువతి తల్లిదండ్రులు, బంధువులు నిరసనకు దిగారు. దాంతో పోలీసులు.. నిందితులను గంటల్లోనే పట్టుకొని అరెస్టు చేశారు. మృతురాలి శరీరంపై అనేక చోట్ల కాలిన గాయాలున్నాయని.. ఈ విషయం గురించి నిందితులను ప్రశ్నిస్తున్నామని ముజఫర్‌పూర్ ఏఎస్పీ సయ్యద్ ఇమ్రాన్ మసూర్ వెల్లడించారు.