
వేములవాడ, వెలుగు : వేములవాడ -రాజన్న ఆలయ గోశాలలో కోడెల మృతి ఆగడం లేదు. అనారోగ్యంతో బాధపడుతున్న మూడు కోడెలు సోమవారం చనిపోయాయి. గోశాలలో ప్రస్తుతం 16 కోడెలు అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఇందులో ఆరింటి పరిస్థితి విషమంగా ఉందని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్రెడ్డి తెలిపారు. వీటిని బతికించేందుకు వెటర్నరీ డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారన్నారు.
అకాల వర్షాలు, అనారోగ్య పరిస్థితుల కారణంగానే కోడెలు చనిపోతున్నాయని చెప్పారు. గోశాలకు ప్రతి రోజు 10 టన్నుల పచ్చిగడ్డి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని, కోడెల ఆరోగ్య సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. గోశాలలో ఇప్పటివరకు మొత్తం 38 కోడెలు చనిపోయాయి.