529 మంది జర్నలిస్టులకు టెస్టులు.. ముగ్గురికి పాజిటివ్

529 మంది జర్నలిస్టులకు టెస్టులు.. ముగ్గురికి పాజిటివ్
  • సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన

న్యూఢిల్లీ: కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం 529 మంది జర్నలిస్టుల నుంచి శాంపిల్స్ సేకరించి టెస్టులు చేయించింది. ఇందులో ముగ్గురికి వైరస్ పాజిటివ్ వచ్చిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. “టెస్టుల్లో 529 మంది మీడియా వ్యక్తులలో వైరస్ బారిన పడినవారి సంఖ్య తక్కువగా ఉండటం సంతోషకరం. మిగతావారంతా డ్యూటీలో జాగ్రత్తలు పాటించాలి. వైరస్ విస్తరిస్తున్న ఇలాంటి కష్ట సమయంలో మీ సేవలు ఎంతో కీలకం. వైరస్ సోకినవారు త్వరగా రికవరీ కావాలని ప్రార్థిస్తున్నా”అని కేజ్రీవాల్ బుధవారం ట్వీట్ చేశారు.
పోయినవారం జరిపిన టెస్టుల్లో ముంబైలో 53 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ రావడంతో.. ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మీడియాలో పనిచేసే వారి కోసం ప్రత్యేకంగా ఒక సెంటర్ ను ఏర్పాటు చేసి టెస్టులు నిర్వహించింది. ఢిల్లీలో ఇప్పటివరకు మొత్తం వైరస్ కేసులు 3,314 కు పెరిగాయి. 54 మంది చనిపోయారు. గడిచిన 24 గంటల్లోనే 206 కేసులు నమోదయ్యాయి.