మితిమీరిన వేగం.. నలుగురి ప్రాణం తీసిన నిర్లక్ష్యం

మితిమీరిన వేగం.. నలుగురి ప్రాణం తీసిన నిర్లక్ష్యం

విశాలంగా ఎక్స్ ప్రెస్ హైవే.. చేతిలో బీఎండబ్ల్యూ కారు.. ఇంకేముంది ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. దాదాపు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకుపోయారు. అంతే కాదు కాసేపట్లో 300వేగాన్ని టచ్ చేస్తామని కూడా చెప్పారు. ఆ విషయాన్ని వీడియో తీస్తూ ఫేస్ బుక్ లైవ్ కూడా పెట్టారు. ఆ వెంటనే వెనక సీట్లో కూర్చున్న మరో వ్యక్తి ఇలాగే నడిపితే చస్తామని కూడా చెప్పాడు. ఇంతలోనే అన్న మాటే నిజమైంది.

ఊహించని స్థాయిలో అత్యంత స్పీడ్ తో దూసుకొచ్చిన ఆ కారు, ఓ ట్రక్కును ఢీకొంది. ఇంకేముంది..  వాళ్ల నలుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే పై చోటు చేసుకుంది. 

బీహార్ రోహ్‌తాస్‌లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్ ఆనంద్ ప్రకాశ్ బీఎండబ్ల్యూ కారును నడుపుతున్నాడు. ఆ కారులో అతనితో పాటు అతని స్నేహితులు దీపక్ కుమార్ (ఇంజనీర్), అఖిలేశ్ సింగ్ (రియల్టర్), ముఖేష్ (వ్యాపారి) ఉన్నారు. వాళ్లంతా బీహార్ నుంచి ఢిల్లీకి కారులో వెళ్తున్నారు. ఆ సమయంలోనే వారు వెళ్లే కారు వేగాన్ని ఫేస్ బుక్ లో లైవ్ పెట్టి మరీ చూపించారు.

ఈ వీడియోలో కారు స్పీడు 230 దగ్గర ఉంది. అయితే తన స్నేహితులు ఎంకరేజ్ చేయడంతో డ్రైవింగ్ చేస్తున్న ఆనంద్ ప్రకాశ్ సైతం కారు వేగాన్ని పెంచాడు. ఈ క్రమంలోనే వారు ట్రక్కును ఢీకొట్టారు. ఈ ఘటనలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘోర ప్రమాదంలో ఓ యువకుడి తల, చేయి 20 నుంచి 30మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం పూర్తి కాలేదని, అక్కడక్కడా ఇంకా ప్యాచ్ వర్క్ నడుస్తోందని.. ఈ విషయం తెలియక వారు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశారని పోలీసులు తెలిపారు.