ఏపీలో భారీగా కేసులు నమోదవడం గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జవహర్ రెడ్డి. రాష్ట్రంలో అధికంగా టెస్టులు చేయడం వల్లే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా బయటపడుతున్నట్లు తెలిపారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ని 13 జిల్లాలో 5783 మందికి టెస్టులు చేయగా.. 82 పాజిటివ్ కేసులు వచ్చాయని చెప్పారు. మొత్తం రాష్ట్రంలో 1259 కేసులు నమోదయ్యాయని, వారిలో 31 మంది మరణించగా.. 258 మంది డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించారు. ప్రస్తుతం 970 మంది చికిత్స పొందుతున్నారన్నారు. మంగళవారం సాయంత్రం ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 80,344 మందికి కరోనా టెస్టులు చేశామన్నారు. 10 లక్షల జనాభాకు సగటున 1504 మందికి పరీక్షలు చేశామని చెప్పారు. టెస్టులు చేసిన వాటిలో 1.57 శాతం మాత్రమే పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు జవహర్ రెడ్డి. దేశ వ్యాప్తంగా ఇన్ఫెక్షన్ రేటు 4.13 శాతంగా ఉందన్నారు.
ఫ్రంట్ లైనర్స్ కు కరోనా
కరోనాపై ఫ్రంట్ లైన్ లో ఉండి పోరాడుతున్న ఉద్యోగులకు ఇప్పటి వరకు 31 మందికి వైరస్ సోకిందని చెప్పారు జవహర్ రెడ్డి. అందులో కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇస్తున్న 12 మంది డాక్టర్లు, 12 మంది నర్సులు, ఏడుగురు పారిశుధ్య కార్మికులు ఉన్నారని తెలిపారు. అలాగే రాజ్ భవన్ లో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చిన మాట వాస్తవమేనన్నారు. గవర్నర్ దంపతులకు కూడా టెస్ట్ చేశామని, వారికి నెగటివ్ వచ్చిందని తెలిపారు.