హైదరాబాద్, వెలుగు: ఓల్డ్ సిటీలో గంజాయి ముఠా గుట్టురట్టైంది. ఒడిశా నుంచి గంజాయి సప్లయ్ చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను సౌత్ ఈస్ట్ టాస్క్ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. రూ.3 లక్షల విలువైన 31.34 కిలోల గంజాయి, కారు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను టాస్క్ఫోర్స్ అడిషనల్ డీసీపీ మనోహర్ మంగళవారం వెల్లడించారు.
మైలార్దేవ్పల్లికి చెందిన షేక్అబ్దుల్ఫైజల్, మహ్మద్ సమీఉద్దీన్, మహ్మద్ అమీర్, హుస్నా ఫాతిమా.. ఈ నలుగురు గ్యాంగ్ గా ఏర్పడి వైజాగ్ లోని అరకు, ఒడిశాలోని ఏజెన్సీల నుంచి గంజాయి కొని సిటీకి తీసుకొచ్చారు. న్యూఇయర్ సందర్భంగా సిటీలో అమ్మేందుకు యత్నించారు. వీరిపై నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు కంచన్బాగ్ క్రాస్ రోడ్స్లో నలుగురిని అరెస్టు చేశారు. ఒడిశా నుంచి వీరికి గంజాయి సప్లయ్ చేసిన నిందితుడు రితేష్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.