అఫ్గాన్‌ మసీదులో బాంబు పేలుళ్లు.. 32 మంది మృతి

అఫ్గాన్‌ మసీదులో బాంబు పేలుళ్లు.. 32 మంది మృతి

అఫ్గానిస్థాన్‌లోని కాందహార్ సిటీలో శుక్రవారం బాంబు పేలుళ్లతో బీభత్సం జరిగింది.  షియా తెగకు చెందిన  ఇమామ్ బర్గా మసీదులో వరుసగా మూడు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 32 మంది మరణించగా.. 53 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొదట మెయిన్‌ డోర్ దగ్గర, ఆ తర్వాత మసీదులో దక్షిణ భాగంలో, మూడోది ప్రార్థనలకు ముందు కాళ్లు కడుక్కునే చోట బ్లాస్ట్స్ జరిగాయని ప్రత్యక్ష సాక్షి తెలిపినట్లు ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. అయితే ఈ దాడికి పాల్పడింది ఎవరన్నది ఇంకా తెలియలేదు. ఏ టెర్రరిస్ట్ సంస్థ కూడా తామే చేసినట్లు ప్రకటించుకోలేదు. 

వరుసగా రెండో వారం..

షియా తెగ ముస్లింల శుక్రవారం ప్రార్థనలను టార్గెట్ చేసి ఉగ్ర మూకలు అఫ్గాన్‌లో ఇలా బాంబు దాడులకు పాల్పడడం ఇది వరుసగా రెండో వారం. గత శుక్రవారం కుందుజ్ సిటీలో ఓ మసీదుపై ఐఎస్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేసి, దాదాపు 100 మంది సామాన్యలును బలి తీసుకున్నారు.

చాలా బాధాకరం: తాలిబాన్‌

ఈ ఘటనపై తాలిబాన్ హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి సయ్యద్‌ ఖోస్తీ స్పందించాడు. కాందహార్‌‌లోని షియా మసీదుపై జరిగిన దాడి తమను ఎంతో బాధించిందని పేర్కొన్నాంటూ ట్వీట్ చేశాడు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించాడు. అఫ్గాన్ స్పెషల్ ఫోర్సెస్‌ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించాడు. ఈ ఘటనకు బాధ్యులను పట్టుకుని, శిక్షిస్తామని పేర్కొన్నాడు.

ఐఎస్‌ పనేనా?

అఫ్గాన్‌లో మైనారిటీలుగా ఉన్న షియా తెగ ముస్లింలను ఎప్పటి నుంచో ఐఎస్ ఉగ్రవాదులు టార్గెట్ చేసి దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల తాలిబాన్లు అఫ్గాన్‌ను తమ చేతుల్లోకి తీసుకున్న తర్వాత కాబూల్ ఎయిర్‌‌పోర్ట్ సహా మరికొన్ని ప్రాంతాల్లో బాంబు దాడులు చేసిన ఐఎస్ ఉగ్రవాదులే ఈ దాడి కూడా చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తల కోసం..

స్వశక్తితో.. ప్రపంచంలోనే పవర్‌‌ఫుల్‌ ఆర్మీగా భారత్!: మోడీ

16 కిలోల బంగారు చీరలో అమ్మవారు.. ఫోటోలు వైరల్

ఆర్కే మృతి నిజమే.. అంత్యక్రియలు మేమే చేశాం: మావోయిస్టు పార్టీ లేఖ