తెలంగాణలో 360 మంది మిల్లర్లు 3 వేల కోట్లకు పైగా దోపిడీ

తెలంగాణలో 360 మంది మిల్లర్లు 3 వేల కోట్లకు పైగా దోపిడీ

నెట్​వర్క్​, వెలుగు: రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను అడ్డాగా చేసుకొని మిల్లర్లు నడిపిన భారీ స్కామ్​ బయటపడింది. వడ్లు కొనకుండానే కొన్నట్లుగా రికార్డులు చూపించి వేల కోట్లు దోచేశారు. ఫేక్​ ట్రక్​ షీట్లతో జరిగిన ఈ దందా వెనుక సూత్రదారులు రైస్​ మిల్లర్లు కాగా.. వీరికి కొందరు అగ్రికల్చరల్​ ఆఫీసర్లు, సెంటర్ల  నిర్వాహకులు, సివిల్​ సప్లయ్స్​ ఆఫీసర్లు సహకరించినట్లు తేలింది. గత బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో మొదలైన ఈ దందా ఇప్పటికీ కొనసాగుతున్నది. 

వడ్లు కేటాయించినట్లు రికార్డుల్లో ఉండడం, కానీ ఆ మేరకు కస్టమ్​ మిల్లింగ్​ రైస్​ (సీఎంఆర్)​  రాకపోవడంతో ఇటీవల సివిల్​ సప్లయ్స్​ కొత్త కమిషనర్​ స్టీఫెన్​రవీంద్ర.. విజిలెన్స్​, ఎన్​ఫోర్స్​మెంట్ తనిఖీలకు ఆదేశించారు. జిల్లాల్లో తనిఖీలు ప్రారంభించగానే ఈ స్కామ్​ బయటపడింది. గత పదేండ్లుగా మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకపోవడం వెనుక అసలు మతలబు ఇదే అనే విషయం వెలుగులోకి వచ్చింది. ఎంక్వైరీ ఆఫీసర్లు తీగలాగినకొద్దీ ఒక్కో డొంక  కదులుతున్నది. ఇలా ఫేక్​ ట్రక్​ షీట్లతో పక్కదారి పట్టిన నిధులు రూ. 2 వేల కోట్లకు పైగా ఉన్నట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. 

360 మంది మిల్లర్లు..రూ.3 వేల కోట్లకుపైగా దోపిడీ..

పదేండ్లుగా 360 మందికి పైగా రైస్​ మిల్లర్లు రూ.3 వేల కోట్లకు పైగా విలువైన సీఎంఆర్​ బియ్యం ఇవ్వకుండా ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. కేవలం 20 మంది మిల్లర్లే ఏకంగా రూ.600 కోట్ల విలువైన బియ్యాన్ని ప్రభుత్వానికి సప్లయ్​ చేయట్లేదు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో సివిల్​ సప్లయ్​ ఆఫీసర్లు రైస్​ మిల్లులకు వెళ్లి తనిఖీలు చేస్తే అక్కడ వడ్ల బస్తాలు కనిపించడం లేదు. బియ్యమూ లేవు.  మొదట్లో ప్రభుత్వం కేటాయించిన వడ్లను మిల్లర్లు  బయట అమ్ముకొని లెవీ పెట్టడం లేదని భావించారు. దీంతో అధికారులు  రైస్​ మిల్లులకు నోటీస్​లు ఇవ్వడంతోపాటు కొన్ని చోట్ల రైస్​ మిల్లులను సీజ్​ చేస్తూ ఒత్తిడి పెంచారు. అయినప్పటికీ లాభం లేకపోవడంతో  కొత్తగా బాధ్యతలు తీసుకున్న సివిల్​ సప్లయ్​ కమిషనర్​ స్టీఫెన్​ రవీంద్ర రూట్​మార్చారు.

సీఎంఆర్​ బియ్యం ఇవ్వని రైస్​ మిల్లుల్లో విజిలెన్స్​, ఎన్​ఫోర్స్​మెంట్​తనిఖీలకు ఆదేశించారు. ఎప్పట్లాగే కేటాయించిన వడ్లు, మిల్లుల్లో నిల్వలకు మధ్య ఉన్న తేడాకే పరిమితం కాకుండా లోతుగా దర్యాప్తు చేయించారు. ఆయా రైస్​ మిల్లులకు వడ్ల బస్తాలు ఏ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చాయి? వడ్లు అమ్మిన రైతుల పేర్లేంటి?  వంటి వివరాలనూ క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. దీంతో రైస్​ మిల్లర్లు వడ్లు కొనకుండానే చేసిన దందాలన్నీ  ఒక్కొక్కటిగా వెలుగుచూస్తు న్నాయి.  మొత్తం మీద 2014 నుంచి ఇప్పటి వరకు సీఎంఆర్​ ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్న రైస్​మిల్లర్లలో సుమారు రూ.2 వేల కోట్ల వరకు ఇలాగే కాజేసినట్లు ఎంక్వైరీ 
ఆఫీసర్లు చెప్తున్నారు.