
- 2024లో 100 శాతం లక్ష్యం దాటిన.. 4 జిల్లాలు
- గతేడాది కంటే టార్గెట్ పెంచుకున్న జిల్లాల ఆఫీసర్లు
- దాదాపు డబుల్ లక్ష్యం పెట్టుకున్న జనగామ జిల్లా
- వనమహోత్సవంలో ఇంటింటికీ 6 మొక్కలు ఇచ్చేలా ఏర్పాట్లు
వరంగల్/ జనగామ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం 2025–26 వన మహోత్సవ కార్యక్రమం కోసం ఉమ్మడి ఓరుగల్లు ఆఫీసర్లు కోటి 85 లక్షల 27 వేల 697 మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకున్నారు. రాష్ట్ర అటవీశాఖ మంత్రిగా జిల్లాకు చెందిన కొండా సురేఖ వ్యవహరిస్తుండటంతో ఆరు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారులు వృక్ష సంపదను పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. గతేడాది పెట్టుకున్న లక్ష్యాలు, వాటి అచీవ్మెంట్ ఆధారంగా లెక్కలు వేసుకుని ఈసారి కొత్త టార్గెట్లు పెట్టుకున్నారు. వానలు కురవడమే ఆలస్యం ఒక్కో ఇంటికి 6 మొక్కలు పంపిణీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.
గతేడాది మహబూబాబాద్ జిల్లా టాప్..
ఓరుగల్లు ఆరు జిల్లాలు 2024_25 ఏడాదిలో పెట్టుకున్న లక్ష్యంలో 4 జిల్లాల్లో 100 శాతం కంటే మొక్కలు ఎక్కువగా నాటారు. ఇందులో వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ జిల్లాలున్నాయి. కాగా, మొక్కలు నాటడంలో మహబూబాబాద్ జిల్లా టాప్లో ఉంది. గతేడాది 46 లక్షల 75 వేల మొక్కాలని నాటాలని లక్ష్యం పెట్టుకున్న జిల్లా అధికారులు మరో 46 లక్షల 99 వేల మొక్కలను నాటారు.
వరంగల్ జిల్లా 25,51,248 లక్ష్యం ఉండగా, 25,85,600 మొక్కలను పెంచారు. జనగామ జిల్లా 17,84,000 వేలు టార్గెట్ ఉండగా, 22,81,000 వేలు, హనుమకొండ జిల్లా 17,18,700 లక్ష్యం కాగా, 17,66,325 మొక్కలు నాటారు. భూపాలపల్లి జిల్లాలో గతేడాది 26,12,900 లక్ష్యం పెట్టుకోగా, 23 లక్షల 10 వేల మొక్కలు నాటారు. ములుగు జిల్లా 13,40,000 టార్గెట్ పెట్టుకోగా, 12,92,600 మొక్కలు మాత్రమే నాటారు.
జనగామ టార్గెట్ ఎక్కువ...
ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 2025_26 వనమహోత్సవం కోసం 6 జిల్లాలు గతేడాది కంటే టార్గెట్ ఎక్కువగా పెట్టుకున్నాయి. జనగామ జిల్లా మాత్రం రికార్డు స్థాయిలో రెట్టింపు టార్గెట్ పెట్టుకుంది. గతేడాది 17 లక్షల 84 వేలు టార్గెట్ కాగా, ఈసారి ఏకంగా 30 లక్షల 50 వేల 100 మొక్కలు నాటాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఇటీవల నిర్వహించిన రివ్యూలో స్పష్టమైన ఆదేశాలిచ్చారు. నాటిన ప్రతీ మొక్కకు లెక్క పక్కాగా నమోదు చేసేలా ప్రత్యేక రిజిస్టర్ మెయింటేన్ చేయాలని చెప్పారు.
ఇంటింటికీ 6 మొక్కల పంపిణీ
వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులు ప్రతీ ఇంటికి 6 మొక్కలు పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. మొక్కల పెంపకాన్ని సామాజిక బాధ్యతగా తీసుకోవాలని ప్రజలను చైతన్యం చేస్తున్నారు. పంపిణీ చేసిన మొక్కల లెక్కలను పక్కాగా నమోదు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. గ్రామ పంచాయతీలు, హాస్టల్స్, స్కూళ్లు, లైబ్రరీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పశువైద్య కేంద్రాలు, ప్రభుత్వ భవనాలు, రైతు వేదికలు, అంగన్వాడీ కేంద్రాల్లో తప్పనిసరిగా మొక్కలు నాటాలని నిర్ణయించారు. పంచాయతీరాజ్ శాఖ, ఆర్అండ్ బీ శాఖతో రోడ్ల వెంట అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టనున్నారు.
జిల్లాల వారీగా మొక్కల టార్గెట్ వివరాలు
జిల్లా పేరు 2024-25 2025-26
వరంగల్ 25,51,248 31,04,272
జీడబ్ల్యూడీసీ – 13,00,000
హనుమకొండ 17,18,700 17,66,325
జనగామ 17,84,000 30,50,100
మహబూబాబాద్ 46,75,000 50,13,500
భూపాలపల్లి 26,12,900 28,77,000
ములుగు 13,40,000 14,16,500