బాలుడి పైనుంచి దూసుకెళ్లిన ఆటో.. మైలార్ దేవ్ పల్లి పీఎస్ పరిధిలో ఘటన

బాలుడి పైనుంచి దూసుకెళ్లిన ఆటో.. మైలార్ దేవ్ పల్లి పీఎస్ పరిధిలో ఘటన
  • తీవ్ర గాయాలతో  అక్కడికక్కడే చనిపోయిన చిన్నారి

శంషాబాద్, వెలుగు : నాలుగేండ్ల బాలుడిపై నుంచి ఆటో దూసుకెళ్లగా.. ఆ చిన్నారి చనిపోయాడు. ఈ ఘటన మైలార్ దేవ్ పల్లి పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్​కు చెందిన బినీత్ కుమార్ కోల్ తన కుటుంబంతో కలిసి బతకుదెరువు కోసం సిటీకి వచ్చి మైలార్​దేవ్​పల్లిలోని మధుబన్ కాలనీలో ఉంటున్నాడు. కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేస్తున్నాడు. అతడికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. శనివారం ఉదయం బినీత్ చిన్న కొడుకు వికాస్ కుమార్(4) ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కిందపడిపోగా.. అటువైపుగా వస్తున్న ట్రాలీ ఆటో చిన్నారిపై నుంచి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడ్డ వికాస్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు ఫైల్ చేశారు. 

పేట్ బషీరాబాద్​లో బీటెక్ స్టూడెంట్..

జీడిమెట్ల :  వెహికల్ ఢీకొని బీటెక్ స్టూడెంట్ చనిపోయిన ఘటన పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన జోగినపల్లి రోహిత్ రావు(20) సిటీకి వచ్చి మేడ్చల్​లోని హాస్టల్​లో ఉంటూ ఓ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి తన ఫ్రెండ్ సంతోష్​తో కలిసి మేడ్చల్ నుంచి అల్వాల్​కు బైక్​పై వెళ్తున్నాడు. ఓ వెహికల్ వీరి బైక్ ను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డ రోహిత్ రావు అక్కడికక్కడే మృతి చెందాడు. సంతోష్​​కు సైతం గాయాలు కాగా.. అతడిని హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.