
ధర్మారం,వెలుగు : కరెంట్ షాక్ తో 40 గొర్రె లు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. గొర్రెల కాపరులు తెలిపిన ప్రకారం.. ధర్మారం మండలం చామనపల్లి గ్రామానికి చెందిన ఏడుగురు గొర్రెల కాపరులకు చెందిన సుమారు 700 గొర్రెలు కటికనపల్లి శివారులో మంగళవారం (june 10) మేతకు వెళ్లాయి. అక్కడ ఒర్రె వాగు మీదుగా గొర్రెలను దాటిస్తుండగా పాత విద్యుత్ స్తంభానికి విద్యుత్ సరఫరా కావడంతో మంటలు వ్యాపించాయి.
దీంతో కింద ఒర్రె వాగులో కరెంట్ సరఫరా అయి నీళ్లు తాగుతున్న 40 గొర్రెలు విద్యుత్ షాక్ తో మృతిచెందాయి. కాగా మరో 30 గొర్రెలు తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. గొర్రెల మృతితో సుమారు రూ.6 లక్షల వరకు నష్టం వాటిల్లిందని గొర్రెల కాపర్లు వాపోయారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో గొర్రెలు చనిపోయాయని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి తమకు నష్టపరిహారం ఇచ్చి న్యాయం చేయాలని కోరారు.
ధర్మారం ఎన్పీడీసీఎల్ ఏడీఈ విజయ్ గోపాల్ సింగ్, ధర్మారం ఏఈ ఎండీ ఖాసిం, ఆర్ఐ -–1 వరలక్ష్మి, గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేల్పుల నాగరాజు, గొర్రెల కాపరుల సొసైటీ మండల అధ్యక్షుడు జంగ మహేందర్ వెళ్లి పరిశీలించారు. మృతి చెందిన గొర్రెలకు పరిహారం అందించడానికి ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఏడీఈ విజయ గోపాల్ సింగ్, ఏఈ ఎండీ ఖాసిం తెలిపారు.