
ఇంఫాల్: మణిపూర్లో ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధమని మాజీ మంత్రి తోక్చోమ్ రాధేశ్యామ్ బుధవారం ప్రకటించారు. ఈమేరకు 9 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిశారు. తమకు 44 ఎమ్మెల్యేల బలం ఉందని గవర్నర్కు రాధేశ్యామ్ వివరించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరారు. ఎమ్మెల్యేలంతా సంతకాలు చేసిన నోట్ను ఆయనకు అందజేశారు. కాగా, మణిపూర్లో చెలరేగిన అల్లర్ల కారణంగా బీరెన్ సింగ్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఫిబ్రవరి నుంచి అక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నది.
ఈ నేపథ్యంలో తిరిగి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ లీడర్లు సిద్ధమవుతున్నారు. గవర్నర్ అజయ్ కుమార్తో భేటీ అయ్యాక మాజీ మంత్రి రాధేశ్యామ్ మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రజల ఆశీస్సులతో మణిపూర్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్నం. 44 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు గవర్నర్కు వివరించాం. 10 మందిమి ఇక్కడికి వచ్చాం. అయితే, ఈ విషయంలో తుది నిర్ణయం అధిష్టానం చేతుల్లోనే ఉంది’’ అని రాధేశ్యామ్ తెలిపారు. ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చినట్లు వివరించారు.
కాగా, 2023.. మేలో మైతేయి, కుకీ జాతుల మధ్య ఘర్షణలతో హింసాత్మక పరిస్థితులు ఏర్పడ్డాయి. దాదాపు 20 నెలలపాటు హింస కొనసాగింది. ఈ అల్లర్లలో 250 మంది మరణించగా.. వేలాది మంది మణిపూర్ ను వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే సీఎం బీరెన్సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన సీఎం పదవికి రాజీనామా చేశారు.