V6 News

తల్లిని, భార్యను చంపి.. ఇద్దరు పిల్లలతో సహా రైలు కిందపడి తండ్రి ఆత్మహత్య

తల్లిని, భార్యను చంపి.. ఇద్దరు పిల్లలతో సహా రైలు కిందపడి తండ్రి ఆత్మహత్య

ఏపీ తిరుపతి జిల్లా నారాయణవనం మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. వి.కె. పాలెంలో జరిగిన ఈ ఘటన మృతుల బంధువులను, గ్రామస్థులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

అసలేం జరిగిందంటే..? మోహన్ అనే వ్యక్తి  కన్నతల్లిని, కట్టుకున్న భార్యను అతి దారుణంగా హతమార్చాడు. చున్నీతో వారి గొంతు బిగించి ప్రాణాలు తీసిన మోహన్.. ఆ తర్వాత తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి, భార్యను చంపిన అనంతరం తర్వాత  కుమారుడు కౌశిక్, కుమార్తె హిమనిని తీసుకుని పుత్తూరు మండలం వేపగుంట సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ చెన్నై ఎగ్మోర్ - కాచిగూడ రైలు కింద పడి ముగ్గురూ తనువు చాలించారు.

ఒకే కుటుంబంలో చిగురుటాకుల్లాంటి ఇద్దరు పిల్లలతో పాటు మొత్తం ఐదుగురు మరణించడంతో వెంకటకృష్ణ పాలెం గ్రామం కన్నీరుమున్నీరవుతోంది. అసలు మోహన్ ఇంతటి దారుణానికి ఒడిగట్టడానికి గల కారణాలేంటి? కుటుంబ కలహాలా లేక ఆర్థిక ఇబ్బందులా అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు పోలీసుల తెలియాల్సి ఉంది.