మిల్లుల్లో వడ్లు కనిపించక, సీఎంఆర్​ బియ్యం రాక అయోమయం

మిల్లుల్లో వడ్లు కనిపించక, సీఎంఆర్​ బియ్యం రాక అయోమయం
  • నాగర్​కర్నూల్​ జిల్లాలో పత్తాలేని 54 వేల మెట్రిక్​ టన్నుల సీఎంఆర్​ 

నాగర్ కర్నూల్, వెలుగు: మిల్లుల్లో వడ్లు కనిపించక, సీఎంఆర్​ బియ్యం రాక ఆఫీసర్లు అయోమయానికి గురవుతున్నారు. ఇన్ని రోజులు మిల్లర్లు చెప్పినట్లు వింటూ వచ్చిన సివిల్​ సప్లై ఆఫీసర్లు, టార్గెట్​ అందుకోలేక తంటాలు పడుతున్నారు. పాత బియ్యం ఇయ్యక పోతే కొత్త వడ్లు ఇయ్యమని బెదిరిస్తూనే బియ్యం ఇవ్వండని బతిమిలాడుతున్నారు. ఇప్పటి వరకు పుదుచ్ఛేరి నుంచి బియ్యం దిగుమతి చేసుకున్న మిల్లర్లు తాజాగా ఛత్తీస్​గడ్, బీహార్​ నుంచి బియ్యం తెప్పించి సీఎంఆర్​కు జమ చేస్తున్నారు. 

బ్లాక్​లిస్టులో పెడతామని వార్నింగ్..

2021, 20-22 సంవత్సరాలకు సంబంధించిన సీఎంఆర్​ బియ్యం ఇవ్వని మిల్లులను బ్లాక్​ లిస్ట్​లో పెట్టి 2023 యాసంగి వడ్లు ఇవ్వమని ఆఫీసర్లు వార్నింగ్​ ఇస్తున్నారు. కల్వకుర్తి, వంగూరు మండలాల్లోని రెండు  మిల్లుల నుంచి 11 వేల మెట్రిక్​ టన్నుల సీఎంఆర్​ బియ్యం రావాల్సి ఉంది. ఈ రెండు మిల్లులకు పనిష్మెంట్​ కింద 25 శాతం అదనంగా 14.90 వేల మెట్రిక్​ టన్నుల సీఎంఆర్​ ఇవ్వాలని సివిల్​ సప్లై కమిషనర్​ జారీ చేసిన ఆదేశాలు అమలు కాలేదు. మూడేండ్లలో 5 సీజన్ల కింద 54 వేల మెట్రిక్​ టన్నుల సీఎంఆర్​ రావాల్సి ఉన్నా, జిల్లా సివిల్​ సప్లై ఆఫీసర్లు మిల్లర్లకు అండగా ఉంటూ ఏటా వడ్లు కేటాయిస్తున్నారు. సీఎంఆర్​ కోటా ఇవ్వని మిల్లులు, చౌక బియ్యం నిల్వ, రవాణా చేస్తూ పట్టుబడిన మిల్లులకు వడ్లు ఇవ్వద్దని ఆదేశాలు ఉన్నా ఏదో విధంగా మేనేజ్​ చేసి వడ్లు అలాట్​ చేస్తున్నారు.

మిల్లర్లతో ఆఫీసర్ల మిలాఖత్..

జిల్లా ఏర్పాటు నుంచి సివిల్​ సప్లై డిపార్ట్​మెంట్​లో పాతుకుపోయిన  ఆఫీసర్లు, కింది స్థాయి సిబ్బంది మిల్లర్లతో కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. వెహికల్స్​ తనిఖీల్లో బియ్యం పట్టుబడినా, వాటిని విడిపించుకుని పోయిన ఘటనలున్నాయి. నాగర్​ కర్నూల్​ సివిల్​ సప్లై గోదాం నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యం లారీ గతంలో పట్టుబడగా, బిజినేపల్లి, కల్వకుర్తి, తెల్కపల్లి, అచ్చంపేటలోనూ ఇదే దందా జరుగుతోంది.

ఛత్తీస్​గడ్, బీహార్​ బియ్యం..

ప్రభుత్వం నుంచి వడ్లు తీసుకున్న మిల్లర్లు టార్గెట్​ ప్రకారం సీఎంఆర్​ బియ్యం ఇవ్వకుండా రెండేండ్ల నుంచి తప్పించుకుంటూ వస్తున్నారు. ఇప్పటి వరకు వడ్లు అమ్ముకుని రేషన్​ బియ్యాన్ని అడ్జస్ట్​ చేశారు. ప్రస్తుతం ఈ పరిస్థితి లేకపోవడంతో ఛత్తీస్​గడ్, బీహార్​ నుంచి కామన్​ రైస్​ తెప్పించి ఎఫ్​సీఐకి ఇస్తున్నారు. తెలంగాణ బియ్యంతో పోలిస్తే వీటి ధర కూడా తక్కువే కావడంతో ఈ దందాకు తెరలేపినట్లు చెబుతున్నారు.  

బఫర్​ స్టాక్​ ఉందట!

జిల్లాలోని రా, బాయిల్డ్​ మిల్లుల్లో సీఎంఆర్​ కోసం వడ్లు లేవని అంటుంటే, బఫర్​ స్టాక్​ ఉన్నట్లు సివిల్​ సప్లై ఆఫీసర్లు రిపోర్ట్​ ఇస్తున్నారు. బియ్యం దందాలో కీలక శాఖల ఆఫీసర్లు భారీగానే అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. వడ్లు, బియ్యం దందాలో చేతికి మట్టి అంటకుండా డబ్బు వస్తుండడంతో పొలిటికల్​ లీడర్లు, ప్రజాప్రతినిధుల దృష్టి దీనిపై పడింది. గతంలో కల్వకుర్తి ప్రాంతంలో మాత్రమే కనిపించే రైస్​ మిల్లులు, ప్రస్తుతం ఎక్కడపడితే అక్కడ ప్రారంభిస్తున్నారు. ఒక్క ఈ ఏడాదిలోనే 18 కొత్త మిల్లులు ఏర్పాటయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

వడ్లు మాయం..

కొనుగోలు కేంద్రాల ద్వారా వానాకాలం, యాసంగి సీజన్లలో కొనుగోలు చేస్తున్న వడ్లు నేరుగా రైస్​ మిల్లులకు చేరుతోంది. జిల్లాలో సీజనల్​ సాగు విస్తీర్ణానికి మించి వస్తున్న వడ్లు ఎక్కడివని జిల్లా అధికారులు ఏనాడు ఎంక్వైరీ చేయలేదు. వడ్లు పట్టిన తర్వాత వచ్చే బియ్యం సీఎంఆర్  కింద ఎఫ్​సీఐ గోదామ్​లకు చేరకపోవడం గమనార్హం. 2022 వానాకాలంలో బయట మార్కెట్​లో క్వింటాల్​ ధర రూ.2,700 పలకడంతో సగం మిల్లులు ఖాళీ అయ్యాయి. సీఎంఆర్​ కింద ఇవ్వాల్సిన బియ్యం బదులు రేషన్​ బియ్యం అప్పగించారు. సంచిలో నుంచి  కిలో బియ్యం తీయకుండానే రేషన్​ షాప్​ టూ స్టాక్​ పాయింట్​ ఫార్మూలా అమలు చేశారు. బియ్యం అటు నుంచి ఇటు తిప్పుతూ సొమ్ము చేసుకున్నారు. కొన్ని సందర్భాల్లో కాగితాలపైనే ఈ తతంగం నడిచిందనే ఆరోపణలున్నాయి