మరో 55 మందికి పాజిటివ్‌‌

మరో 55 మందికి పాజిటివ్‌‌

గ్రేటర్‌‌‌‌లో 44.. సంగారెడ్డిలో 2 కేసులు నమోదు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ర్టంలో మరో 55 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్‌‌లో 44, సంగారెడ్డి జిల్లాలో 2 , రంగారెడ్డి జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. ఇతర రాష్ర్టాల నుంచి తిరిగొచ్చిన మరో 8 మంది వలస కార్మికులకు వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇందులో భువనగరి జిల్లాకు చెందిన నలుగురు, జగిత్యాలకు చెందిన ఇద్దరు, జనగామ, మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక్కో వ్యక్తి ఉన్నారు.  దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,509కి చేరింది. ఇందులో వలస కార్మికులు 52 మంది ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. 971 మందిని దవాఖాన నుంచి డిశ్చార్జ్‌‌ చేయగా, 504 యాక్టివ్ కేసులు ఉన్నట్టు పేర్కొంది. శనివారం పాజిటివ్ వచ్చిన వాళ్లలో, లక్షణాలు లేని కొందరిని హోమ్‌‌ ఐసోలేషన్‌‌లో ఉంచినట్టు సమాచారం. రాష్ర్టంలో కరోనా బారిన పడ్డ 1,509 మంది 485 కుటుంబాలకు చెందినవారేనని  వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. అత్యధికంగా హైదరాబాద్‌‌లో 168 కుటుంబాలు, రంగారెడ్డిలో 59, మేడ్చల్‌‌లో 39, నిజామాబాద్‌‌లో 30, వరంగల్‌‌ అర్బన్‌‌లో 26, సూర్యాపేటలో 25 కుటుంబాల్లో కరోనా వ్యాపించినట్టు పేర్కొంది.

టెస్టులు ఆలస్యం

కరోనా టెస్టులు చేయించడంలో ఆలస్యం జరుగుతోందని అనుమానితులు, పాజిటివ్ పేషెంట్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నయి. గ్రేటర్ హైదరాబాద్‌‌లో కరోనా అనుమానితులను కింగ్ కోఠి, నిజామియా, ఫీవర్, నేచర్‌‌‌‌క్యూర్‌‌‌‌, సరోజిని దవాఖాన్లలోని క్వారంటైన్ సెంటర్లకు తరలించి, అక్కడే శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌‌లకు పంపిస్తున్నారు. శాంపిల్‌‌ సేకరించిన 24 గంటల తర్వాత కూడా రిజల్ట్ రావడం లేదని బాధితులు చెప్తున్నారు. వాస్తవానికి కరోనా టెస్టుకు 6 నుంచి 8 గంటలు పడుతుంది. హైదరాబాద్‌‌లోని 9 ల్యాబుల్లో రోజుకు 1,540 టెస్టులు చేయగల సామర్థ్యం ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ రోజుకు 500 టెస్టులు కూడా చేయడం లేదు.

 మంచిగ చూస్తలేరంటున్న బాధితులు

‘గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు మమ్మల్ని సరోజిని హాస్పిటల్‌‌కు తీసుకెళ్లారు. వెంటనే శాంపిల్ తీశారు. శనివారం మధ్యాహ్నం వరకు రిజల్ట్ రాలేదు. ఫుడ్ అస్సలు బాలేదు. బీపీ, షుగర్ పేషెంట్లకు ట్యాబ్లెట్లు అడిగినా ఇవ్వలేదు. తినడానికి ఏమైనా ఇవ్వండని అడిగితే పెండ్లికి వచ్చారా? అని తిడుతున్నారు. ఫస్ట్ మా ఫ్యామిలీలో 8 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. తర్వాత ముగ్గురికే పాజిటివ్ అన్నారు. మా ముగ్గుర్ని రాత్రి గాంధీకి షిఫ్ట్ చేశారు’ అని మాదన్నపేట్‌‌కు చెందిన సుధాకర్  ఆవేదన వ్యక్తం చేశారు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని ఈ నెల10న ఫీవర్ హాస్పిటల్‌‌కు వెళ్తే, నార్మల్‌‌గానే ఉన్నావని తిప్పి పంపించారని సందీప్ అనే వ్యక్తి చెప్పారు. రెండ్రోజుల తర్వాత శ్వాస తీసుకోవడంలో మరింత ఇబ్బంది అవడంతో సందీప్‌‌ కేర్ హాస్పిటల్‌‌లో జాయిన్ అయ్యాడు. అక్కడి డాక్టర్లు పరీక్షించి, కరోనా టెస్ట్‌‌ కోసం నిమ్స్‌‌కు శాంపిల్స్ పంపించారు. అక్కడ చేసిన టెస్టులో ఆయనకు వైరస్ పాజిటివ్ ఉన్నట్టు తేలింది. దీంతో గాంధీకి షిఫ్ట్ చేశారు.

‘సారి’ పేషెంట్లలో 102 మందికి పాజిటివ్‌‌

సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్‌‌నెస్‌‌(సారి)తో ప్రైవేటు దవాఖాన్లలో చేరిన 4.63 శాతం మందికి కరోనా వచ్చింది. ఏప్రిల్ 1 నుంచి మే 12 వరకూ 2,238 మంది సారి పేషెంట్లకు కరోనా టెస్టులు చేయించగా ఇందులో 102 మందికి వైరస్ సోకినట్టు తేలింది. ఇవన్నీ గ్రేటర్ హైదరాబాద్‌‌కు చెందిన కేసులేనని అధికారులు తెలిపారు. ప్రైవేటు, ప్రభుత్వ దవాఖాన్లకు వచ్చే సారి పేషెంట్ల వివరాలను వైద్యారోగ్యశాఖ సేకరిస్తోంది. దవాఖాన్ల వారీగా పేషెంట్ల వివరాలను ఆన్‌‌లైన్‌‌లో అప్‌‌లోడ్ చేస్తున్నారు. వీళ్లందరికీ కరోనా టెస్టులు చేపిస్తున్నారు. ప్రైవేటు హాస్పిటల్స్‌‌కు వచ్చే సారి పేషెంట్ల నుంచి శాంపిల్స్‌‌ సేకరించి, నిమ్స్‌‌లో టెస్టులు చేయిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి