కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ నటించిన జన నాయగన్ పైరసీకి గురైన విషయం తెలిసిందే. థియేటర్లలో విడుదలకు ముందే పూర్తి సినిమా పైరసీ వెబ్సైట్లలో ప్రత్యక్షమవ్వడం నిర్మాతలు మరియు అభిమానులను తీవ్రంగా కలవరపరిచింది. ఈ మేరకు నిర్మాతలు KVN Productions ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆరుగురిని అరెస్ట్ చేసి న్యాయస్థాన రిమాండ్కు పంపించారు.
300కు పైగా పైరసీ లింకులకు చెక్
‘జన నాయగన్’ సినిమా ఏప్రిల్ 9న సినిమా క్లిప్లు, కొన్నిచోట్ల పూర్తిస్థాయి చిత్రం కూడా ఇంటర్నెట్లో లీక్ అయ్యాయి. సినిమా నిర్మాతల ఫిర్యాదు ఆధారంగా తమిళనాడు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సెంటర్లో కేసు నమోదు చేశారు. ఈ మేరకు భారతీయ న్యాయ సంహిత (BNS), ఐటీ చట్టం, కాపీరైట్ చట్టం, సినీమాటోగ్రాఫ్ చట్టాల కింద నిందితులపై కేసులు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.
Also Read : సినీ సంగీతాన్ని కొత్త కోణంలో పరిచయం చేసిన ఆశా భోస్లే
దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, పైరసీ లింకులను గుర్తించడం, వాటిని బ్లాక్ చేయడం, డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణ చేయడం, అలాగే లీక్కు బాధ్యులైన వ్యక్తులను గుర్తించడం వంటి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సినిమాను అనుమతి లేకుండా వివిధ డిజిటల్ ప్లాట్ఫార్మ్లలో పంచబడినట్లు గుర్తించిన అధికారులు, ఇప్పటివరకు 300కు పైగా పైరసీ లింకులను తొలగించారు.
నిందితులు క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్ఫార్మ్లు మరియు షేర్డ్ డ్రైవ్ లింకులను ఉపయోగించి సినిమాను పంచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. వారి వద్ద నుంచి డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుతం అధికారులు సోషల్ మీడియా, వెబ్సైట్లు, ఫైల్ షేరింగ్ సర్వీసులను నిరంతరం పర్యవేక్షిస్తూ మరిన్ని లీకులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. 300కు పైగా లింకులను బ్లాక్ చేయడానికి చర్యలు కొనసాగుతున్నాయి.
సైబర్ క్రైమ్ హెచ్చరిక..
సైబర్ క్రైమ్ విభాగం ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ, పైరసీ కంటెంట్ను డౌన్లోడ్ చేయడం, చూడడం లేదా షేర్ చేయడం చట్టవిరుద్ధమని తెలిపింది. ఎవరైనా, ఇలాంటి తప్పుడు చర్యలకు పాల్పడితే.. దోషులకు కఠిన శిక్షలు ఉంటాయని పేర్కొంది.
అలాగే, సోషల్ మీడియా లేదా ఇతర ప్లాట్ఫార్మ్ల ద్వారా పైరసీ కంటెంట్ను ప్రోత్సహించే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ కేసులో మరింత మంది నిందితులను గుర్తించే పనిలో దర్యాప్తు కొనసాగుతోందని సైబర్ క్రైమ్ తెలిపింది.
ఇక KVN ప్రొడక్షన్స్ ప్రజలను అక్రమ లింకులను వెంటనే తొలగించమని కోరుతూ, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు, నటుడు విజయ్ ప్రస్తుతం తన రాజకీయ పార్టీ TVK తరఫున తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో ఈ లీక్ ఘటనపై ఇంకా స్పందించలేదు.
#JanaNayagan pic.twitter.com/wNLRSsmaHq
— KVN Productions (@KvnProductions) April 10, 2026
రిలీజ్ ఎప్పుడు..?
'ఖాకీ' ఫేమ్ హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా ఉండబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ పవర్ఫుల్ రోల్లో కనిపిస్తున్నారు. వీరికి తోడు మమితా బైజు, ప్రకాష్ రాజ్, ప్రియమణి వంటి భారీ స్టార్ కాస్ట్ ఉంది.
సెన్సేషనల్ అనిరుధ్ రవిచందర్ బాణీలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.. కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.ఎలక్షన్స్ అనంతరం విడుదల చేయనుందని సమాచారం.
