
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7కు చేరినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటెన్ విడుదల చేసింది. సోమవారం విశాఖపట్నంలో మరొకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ప్రకటించింది. ఇప్పటివరకు ఏపీలో ప్రకాశం, నెల్లూరు, విజయవాడ, కాకినాడలో ఒక్కో బాధితుడు, విశాఖలో ముగ్గురు కరోనా బాధితులు ఉన్నట్లు తెలిపింది. ఏపీలో మొదటి కరోనా బాధితుడు పూర్తిగా కొలుకున్నాడని, నెల్లూరు ఐసోలేషన్ వార్డు నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ప్రకటించింది. 181 కరోనా సస్పెక్టెడ్ కేసుల్లో నమూనాలను తిరుపతి రుయా వైరాలజీ ల్యాబ్ లో పరీక్షించగా 166 మందికి నెగెటివ్ వచ్చిందని తెలిపింది. మరో 8 మంది రిజల్ట్స్ రావాల్సి ఉందని తెలిపింది.
11,026 మంది హోమ్ క్వారంటైన్
ఫారిన్ నుంచి ఏపీకి 13,301 మంది ప్రయాణికుల వచ్చారని హెల్త్ మినిస్టర్ ఆళ్ల నాని చెప్పారు. వీరిలో 2,228 మందికి 28 రోజుల క్వారంటైన్ముగిసిందన్నారు. మిగిలిన 11,026 మంది ఇళ్లల్లో క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. 53 మందికి ఆయా జిల్లాల్లోని ఐసొలేషన్వార్డుల్లో ట్రీట్ మెంట్ అందిస్తున్నట్లు చెప్పారు.