వెంకన్నను దర్శించుకున్న90 వేల మంది భక్తులు

వెంకన్నను దర్శించుకున్న90 వేల మంది భక్తులు
  • వైకుంఠ ఏకాదశి సందర్భంగా కిటకిటలాడిన తిరుమల
  • స్వర్ణరథంపై ఊరేగిన మలయప్పస్వామి

తిరుమల, వెలుగు: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సోమవారం తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం రెండో వైకుంఠ క్యూకాంప్లెక్స్​లోని అన్ని కంపార్ట్ మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనం, మాడవీధుల్లో ఏర్పాటు చేసిన షెడ్లలో భక్తులు బారులు తీరారు. రాత్రి ఒంటిగంటకు శ్రీవారికి ధనుర్మాస తిరుప్పావై ఏకాంత పూజలు నిర్వహించారు. తర్వాత 1.10 గంటలకే వీఐపీలను దర్శనానికి అనుమతించారు.  తెల్లవారుజామున 4 గంటలకు సర్వదర్శనానికి అవకాశం కల్పించారు. ఉదయం 10 గంటలకు శ్రీవారి ట్రస్టు దాతలను దర్శనానికి అనుమతించారు. ఉదయం 9 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామిని స్వర్ణరథంపై నాలుగుమాడ వీధుల్లో ఊరేగించారు. చిరుజల్లులు, మంచుతెరల నడుమ  ఉత్సవర్లను భక్తులు దర్శించుకున్నారు. సాయంత్రం 6 గంటల సమయానికి 90 వేల మందికిపైగా భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ వెల్లడించింది.

తిరుమలకు క్యూ కట్టిన వీఐపీలు

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా కేంద్రమంత్రి కిషన్​రెడ్డి, తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, హరీశ్ రావు, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు చీఫ్​ జస్టిస్​ జితేంద్ర మహేశ్వరి,  ఏపీ ఉప ముఖ్యమంత్రులు పుష్ప శ్రీవాణి, నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి, అనిల్‌, అవంతి శ్రీనివాస్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌, సురేశ్, బాలినేని, విశ్వరూప్‌, సినీనటి, మండ్య ఎంపీ సుమలత, సునిల్, సప్తగిరి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.