
- వైకుంఠ ఏకాదశి సందర్భంగా కిటకిటలాడిన తిరుమల
- స్వర్ణరథంపై ఊరేగిన మలయప్పస్వామి
తిరుమల, వెలుగు: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సోమవారం తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం రెండో వైకుంఠ క్యూకాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్ మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనం, మాడవీధుల్లో ఏర్పాటు చేసిన షెడ్లలో భక్తులు బారులు తీరారు. రాత్రి ఒంటిగంటకు శ్రీవారికి ధనుర్మాస తిరుప్పావై ఏకాంత పూజలు నిర్వహించారు. తర్వాత 1.10 గంటలకే వీఐపీలను దర్శనానికి అనుమతించారు. తెల్లవారుజామున 4 గంటలకు సర్వదర్శనానికి అవకాశం కల్పించారు. ఉదయం 10 గంటలకు శ్రీవారి ట్రస్టు దాతలను దర్శనానికి అనుమతించారు. ఉదయం 9 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామిని స్వర్ణరథంపై నాలుగుమాడ వీధుల్లో ఊరేగించారు. చిరుజల్లులు, మంచుతెరల నడుమ ఉత్సవర్లను భక్తులు దర్శించుకున్నారు. సాయంత్రం 6 గంటల సమయానికి 90 వేల మందికిపైగా భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ వెల్లడించింది.
తిరుమలకు క్యూ కట్టిన వీఐపీలు
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, మల్లారెడ్డి, శ్రీనివాస్గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర మహేశ్వరి, ఏపీ ఉప ముఖ్యమంత్రులు పుష్ప శ్రీవాణి, నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి, అనిల్, అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్, సురేశ్, బాలినేని, విశ్వరూప్, సినీనటి, మండ్య ఎంపీ సుమలత, సునిల్, సప్తగిరి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.