వాషింగ్టన్, న్యూయార్క్: కరోనాను ఓడించేందుకు అన్ని రకాలుగా ఫైట్ చేస్తున్నామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. పెరిగిపోతున్న కేసుల సంఖ్య చూస్తుంటే ఈ వైరస్ ఎంత డేంజరో తెలుస్తోందని అన్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 5,603కు చేరింది. దేశంలో బాధితుల సంఖ్య 2 లక్షల 35 వేలకు చేరింది. ఇందులో ఒక్క న్యూయార్క్లోనే 93 వేల వరకు కేసులు నమోదయ్యాయి. అక్కడ 2,373 మంది చనిపోయారు. గత కొన్ని దశాబ్దాల్లో అమెరికా ఇలాంటి పరిస్థితిని చూడలేదని ట్రంప్ అన్నారు. ఈ మహమ్మారిపై ఫైట్లో భాగంగా సోషల్ డిస్టెన్స్ను కంపల్సరీ చేయడంతోపాటు వర్కర్లకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. ఆంక్షలను 30 రోజుల పాటు కొనసాగించనున్నట్లు తెలిపారు. 30 నుంచి 70 రోజుల పాటు ఇళ్లుదాటి ఎవరూ బయట కాలు పెట్టొద్దని సర్కార్ ఇప్పటికే ఆదేశించింది. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలతో పాటు టూరిస్టు ప్రాంతాలను క్లోజ్ చేసింది. వేలాది వెంటిలేటర్లను తయారుచేయాలంటూ కార్లు, విమానాలు తయారీదారులు, ఇతర కంపెనీలను ట్రంప్ కోరారు. ఇప్పటికే 11 కంపెనీలలో వెంటిలేటర్ల తయారీ మొదలైందన్నారు. రాబోయేవి గడ్డురోజులని, ప్రజలంతా ధైర్యంగా ఎదుర్కోవాలని ట్రంప్ కోరారు. మనమంతా కలిసి పోరాడి వైరస్ పై గెలుపు సాధిద్దామని పిలుపునిచ్చారు. కరోనా హాట్స్పాట్గా గుర్తించిన సిటీలకు విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. న్యూయార్క్, డెట్రాయిట్ తదితర సిటీలకు తిరిగే విమానాల సంఖ్యను తగ్గించనున్నట్లు తెలిపారు. చైనా కమ్యూనిస్టు పార్టీ కరోనా విషయంలో అబద్ధాలు చెప్పింది.. చెబుతోంది.. ఇకముందు చెబుతుందని విమర్శించారు. చైనా చెప్పే లెక్కలు నమ్మేలా లేవని అన్నారు.
న్యూయార్క్లో 16 వేల మంది చనిపోతరు
కరోనా వైరస్ కారణంగా న్యూయార్క్లో కనీసం 16 వేల మంది చనిపోతరని అక్కడి గవర్నర్ అండ్రూ క్యూమో చెప్పారు. ఓ ప్రాజెక్ట్ రిపోర్టును కోట్ చేస్తూ ఈ కామెంట్ చేశారు. కరోనాను కట్టడి చేసేలోగా 16 వేల మంది న్యూయార్క్వాసులతో సహా 93 వేల మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోతారని రిపోర్టు చెప్పింది.
మందులతో అమెరికా చేరిన రష్యన్ ఫ్లైట్
అమెరికాలో రోగుల ట్రీట్మెంట్కు అవసరమయ్యే మందులతో రష్యన్ విమానం న్యూయార్క్ చేరుకుంది. మందులు, ఇతర వైద్య పరికరాల కోసం కొన్ని రోజుల కిందట రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ట్రంప్ చర్చించారు. దీంతో పుతిన్ ఈ విమానాన్ని పంపించారని అధికారులు చెప్పారు. ఫ్లైట్లో మందులు, వెంటిలేటర్లు, మాస్కులు సహా వైరస్ సోకకుండా ఉపయోగించే 60 టన్నుల వైద్య పరికరాలు ఉన్నాయన్నారు.
తక్కువ ఖర్చులో వెంటిలేటర్
వైరస్ బాధితులకు ట్రీట్మెంట్ అందించేందుకు ఇండియన్ ఇంజనీర్లు తక్కువ ఖర్చులో వెంటిలేటర్ మోడల్ తయారు చేశారని అమెరికా వెల్లడించింది. ఎంఐటీ ఇనిస్టిట్యూట్ సాయంతో రూపొందించిన ఈ మోడల్ వెంటిలేటర్లను పెద్ద సంఖ్యలో తయారుచేయడం ద్వారా చాలా మంది ప్రాణాలు కాపాడవచ్చని పేర్కొంది. ఇప్పుడున్న వెంటిలేటర్ల తయారీకి 30 వేల డాలర్లు ఖర్చుపెట్టాల్సి వస్తుండగా.. కొత్త మోడల్ 400 నుంచి 500 డాలర్లతోనే రెడీ చేయొచ్చని చెప్పింది.
వైరస్ ఎక్స్పర్ట్కు సెక్యూరిటీ పెంపు
అమెరికాలోనే టాప్ మెడికల్ ఎక్స్పర్ట్, కరోనా వైరస్ టాస్క్ఫోర్స్మెంబర్ డాక్టర్ ఆంథోని ఫౌసీ కి ప్రభుత్వం సెక్యూరిటీ పెంచింది. ఆయనకు 24 గంటలు సెక్యూరిటీ కల్పించింది. ఆయన ప్రాణాలకు ముప్పు కలగొచ్చనే ఉద్దేశంతోనే సెక్యూరిటీ పెంచినట్లు అధికారులు చెప్పారు. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. డాక్టర్ ఆంథోనిని అందరూ ప్రేమిస్తారని, ఆయనపై ఎవరికీ కోపం ఉండదని అన్నారు. వైరస్ ముప్పు ఎక్కువగా ఉన్న ఈ టైంలో ఆయనకు ఏమైనా జరిగితే దేశం ఇబ్బందుల్లో పడుతుందని చెప్పారు. అందువల్లే ఆయన సెక్యూరిటీ పెంచినట్లు వివరించారు.
మరో రెండేళ్లు వైరస్ మనతోనే
కరోనా బాధితులు ప్రతీ నలుగురిలో ఒకరికి ఎలాంటి వైరస్ లక్షణాలు కనిపించడంలేదని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ రాబర్ట్ రెడ్ఫీల్డ్ చెప్పారు. దీనివల్లే వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోందన్నారు. ఇప్పుడు వైరస్ను కట్టడి చేసినా మరో రెండేళ్ల పాటు కరోనా మనతోనే ఉంటుందని, మరోసారి విరుచుకుపడుతుందని చెప్పారు.