
- చాక్లెట్ ఆశచూపి
- ఆరేండ్ల బాలుడి కిడ్నాప్
- పేట్లబురుజు ఆస్పత్రిలో ఘటన
- దంపతుల అరెస్ట్, పరారీలో మరో ఇద్దరు కిడ్నాపర్లు
హైదరాబాద్, వెలుగు: పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో ఆరేండ్ల బాలున్ని కిడ్నాప్ చేసిన ముఠాను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. బాలున్ని రెస్క్యూ చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాలను సౌత్జోన్ డీసీపీ సాయిచైతన్య వెల్లడించారు. 24 గంటల్లోనే కిడ్నాపర్లను పట్టుకున్నట్లు తెలిపారు. నల్లగొండ జిల్లా హాలియా మండలం అనుములకు చెందిన ఒర్సు వెంకన్న(30), కవిత(26) దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఐదు నెలలుగా వీరు హైదరాబాద్ పెద్దఅంబర్పేట్లో ఉంటున్నారు.
స్థానికంగా లేబర్ పనులు చేస్తుంటారు. వీరికి మగసంతానం లేకపోవడంతో ఎవరైనా బాలున్ని దత్తత తీసుకోవాలనుకున్నారు. ఇదే విషయాన్ని వెంకన్న మునగాలకు చెందిన తన స్నేహితుడు దర్శణం రాజు(25)కు చెప్పాడు. ఇందుకోసం రాజు రూ.లక్షకు డీల్ కుదుర్చుకున్నాడు. రూ.60 వేలు అడ్వాన్స్గా తీసుకున్నాడు. ఈ నెల 23న తన భార్య కళమ్మతో కలిసి పేట్లబురుజులోని మెటర్నటీ హాస్పిటల్కు వెళ్లారు. నారాయణ పేట్ నర్వ గ్రామానికి చెందిన కుర్వ గీత(26) గర్భవతి కావడంతో అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నది.
చాక్లెట్ ఆశ చూపి హాస్పిటల్ నుంచి కిడ్నాప్
గీత కొడుకు శివకుమార్(6) హాస్పిటల్లో ఆడుకుంటుండగా రాజు, కళమ్మ గమనించారు. చాక్లెట్ ఇస్తామని శివకుమార్ను పిలిచారు.చాక్లెట్ కోసం వచ్చిన బాలుడిని కిడ్నాప్ చేశారు. తల్లి గీత ఎంత వెతికినా బాలుడి ఆచూకీ లభించలేదు. దీంతో మరుసటి రోజు హుస్సేని అలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించి.. నాలుగు స్పెషల్ టీమ్స్తో గాలింపు చేపట్టారు. బాలుణ్ని కిడ్నాప్ చేసి పెద్ద అంబర్పేట్ వైపు తీసుకెళ్లినట్లు గుర్తించారు. వెంకన్న, కవిత దంపతులను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. బాలుణ్ణి రెస్క్యూ చేశారు. వెంకన్న, కవితలను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న కిడ్నాపర్లు రాజు, కళమ్మ కోసం గాలిస్తున్నారు.