సత్యం అసత్యమై పదేళ్లైనా వ్యవస్థ గుణపాఠం నేర్చుకోలేదని టెక్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీపీ గుర్నాని అభిప్రాయపడుతున్నారు. కార్పొరేట్ కంపెనీలలో జరిగే మోసాలను కనిపెట్టడానికి సుదీర్ఘ సమయం అవసరమవుతోందని చెప్పారు. లూప్హోల్స్ను అరికట్టడానికి మెరుగైన డేటా ఎనలిటిక్స్ ఆవశ్యకమని కూడా గుర్నాని తెలిపారు.
కంపెనీ అకౌంట్లలో అవకతవకలకు పాల్పడినట్లు సత్యం కంప్యూటర్ సర్వీసెస్ ఛైర్మన్ రామలింగ రాజు ఒప్పుకోలు ప్రకటనను 2009 జనవరిలో చేశారు. అదే ఏడాది ఏప్రిల్లో సత్యం కంప్యూటర్ సర్వీసెస్ లిమిటెడ్ను టెక్ మహీంద్రా చేజిక్కించుకుంది. ఏదైనా కార్పొరేట్ కంపెనీలో జరిగే అవకతవకలను గుర్తించడానికి ఇండియాలో ఎక్కువ టైం పడుతోందని, సత్యం కంప్యూటర్ అనుభవమై పదేళ్లైనా, వ్యవస్థ మెరుగుపడకపోవడం శోచనీయమని టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని వ్యాఖ్యానించారు. ఇలాంటి అవకతవకలు తొలి దశలోనే కనిపెట్టకపోవడం వల్లే కార్పొరేట్ కంపెనీలు సంక్షోభాలలో పడుతున్నాయని అభిప్రాయపడ్డారు. బ్యాంకులు, రుణదాతలు, కంపెనీలు, అందరు స్టేక్ హోల్డర్లు అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మెరుగైన డేటా ఎనలిటిక్స్ అందిపుచ్చుకుని డాష్ బోర్డ్స్ ఏర్పాటు ద్వారా పొరపాట్లను వెంటనే గుర్తిస్తే సత్యం, ఐఎల్ఎఫ్ఎస్ వంటి సంక్షోభాలని నివారించొచ్చని అభిప్రాయపడ్డారు. నిజానికి మనందరం తెలివైన వాళ్లమే. కాకపోతే, మెరుగైన పద్ధతులు, విధానాలు వ్యవస్థలో భాగం కావాల్సి ఉందని గుర్నాని చెప్పారు.
సత్యం కంప్యూటర్ టర్న అరౌండ్ గురించి మాట్లాడుతూ, టేకోవర్ సమయంలో సత్యంలోని చిన్న వాటాదారులకు ఎనిమిదింతల రిటర్న్స్ (ప్రతిఫలం) లభించిందని గుర్నాని అన్నారు. ఏప్రిల్ 2009లో సత్యం కంప్యూటర్ సర్వీసెస్లోని రూ. 830.45 కోట్లకు ఇప్పటిదాకా రూ. 6,614.80 కోట్లు ప్రతిఫలం సమకూరిందని, ఇందులో రూ. 332 డివిడెండ్ కూడా ఉందని గుర్నాని చెప్పారు. అంటే చిన్న ఇన్వెస్టర్లకు ఎనిమిదింతల ప్రతిఫలం దొరికనట్లైందని పేర్కొన్నారు.
సంక్షోభంలో పడిన సత్యం కంప్యూటర్ సర్వీసెస్ను గాడిలోకి తేవడానికి, క్లయింట్లకు నమ్మకం కలిగించడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని తన అనుభవాన్ని పంచుకున్నారు గుర్నాని. కస్టమర్లకు మెరుగైన సేవలందించి, విశ్వసనీయత పెంచేందుకు కంపెనీ ఉద్యోగులూ ఎక్కువగానే శ్రమించారని చెప్పారు. సర్వీస్ నచ్చలేదనే కారణంతో ఏ క్లయింటూ కంపెనీని వీడి పోకుండా చూసేందుకు ఈ చర్య సాయపడిందన్నారు. అప్పట్లో 300 గా ఉన్న క్లయింట్ల సంఖ్య మూడింతలై ఇప్పుడు 900 కి చేరిందని తెలిపారు. సత్యం కంప్యూటర్ సర్వీసెస్కు అతి పెద్ద క్లయింటైన బ్రిటిష్ పెట్రోలియం ఒక్కటే వదిలి వెళ్లిపోయిందని, అది కూడా తమ వ్యయాన్ని తగ్గించుకునే ఉద్దేశంతోనేనని వివరించారు.
టెక్ మహీంద్రాలో ఇప్పుడు ఉద్యోగుల సంఖ్య కూడా అప్పటితో పోలిస్తే మూడు రెట్లు పెరిగి 1,20,000 కు చేరిందని చెప్పారు. ఐటీ బిజినెస్తోపాటు, ప్రధానంగా బీపీఓ వాణిజ్యం వల్లే అంత వృద్ధి సాధ్యమైందని వెల్లడించారు. 2009తో పోలిస్తే, ప్రాసెస్లలో కొంత మార్పు వచ్చిందని చెప్పారు.
- గతంలో సత్యం కంప్యూటర్ సంక్షోభంసమయంలో దాని అసోసియేట్ మేటాస్ ఇన్ ఫ్రా కూడా ఇబ్బం దులలో పడిం ది.సత్యం రామలిం గ రాజు ప్రమోట్ చేసిన ఆమేటాస్ ఇన్ ఫ్రాను ఐఎల్ అండ్ ఎఫ్ ఎస్ గ్రూప్ ఆ తర్వాత కాలంలోచేజిక్కించుకుం ది. ఇది కాకతాళీయమే ఐనా, ఒక స్కామ్ కంపెనీని కొన్న కంపెనీ కూడా స్కామ్ బాటలో పయనించినట్లైంది.రూ. 94 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన ఐఎల్ అండ్ ఎఫ్ ఎస్ కంపెనీ నిర్వహణను కిందటేడాది ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, కొత్త బోర్డును నియమించింది.
- సత్యం కంప్యూటర్ సర్వీసెస్ అకౌంట్లలోరూ. 7,500 కోట్ల అవకతవకలు జరిగాయనే విషయం జనవరి 2009లో బయటకు వెల్లడైంది. అకౌంట్లను తారుమారుచేశానని, ఏళ్ల తరబడి లాభాలను పెంచి చూపించానని ఛైర్మన్ రామలింగ రాజు స్వయంగా ఒప్పుకున్నారు. 2009 ఏప్రిల్ లో సత్యం కంప్యూటర్ను కొన్నప్పటికీ, దానిని మహీంద్రా సత్యం పేరిట ప్రత్యేక కంపెనీగానే కొన్నేళ్లు నిర్వహిం చారు. ఆతర్వాత 2012లో మహీంద్రా సత్యంను టెక్ మహీంద్రాలో విలీనం చేశారు.
- మార్చి 2000 నాటికి సత్యం కంప్యూటర్ సర్వీసెస్ షేర్ రూ. 7,229 వద్ద ట్రేడయ్యేది.జనవరి 2009 నాటికి ఎన్ ఎస్ఈలో అదేషేర్ ధర రూ. 6.30కి పతనమైంది.