Yash: హీరో యష్ ఎస్కార్ట్ వాహనం ఢీకొని..అభిమానికి గాయాలు

Yash: హీరో యష్ ఎస్కార్ట్ వాహనం ఢీకొని..అభిమానికి గాయాలు

కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన హీరో యష్(Yash)కు వీపరీతమైన ఫ్యాన్స్ ఫాల్లోవింగ్ ఉంది. తన సినిమాల అప్డేట్ కోసం ఎదురుచూసే ఫ్యాన్స్ ఇండియా వైడ్గా ఉన్నారు. అయితే, కొన్నాళ్ల నుంచి తన అభిమానులు ఏదో ప్రమాదంలో చిక్కుకుంటున్నారు.

తాజాగా హీరో యష్ ఎస్కార్ట్ వాహనం ఢీకొని ఓ అభిమానికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే..కర్ణాటక బళ్లారి శివార్లలోని బాలాజీ క్యాంపులో అమృతేశ్వర స్ఫటిక లింగ ఆలయాన్ని ఇవాళ (ఫిబ్రవరి 29న) ప్రారంభించారు. ఈ మహాత్తర కార్యక్రమానికి హీరో యష్ వస్తున్నారని తెలిసి అక్కడికి పెద్ద ఎత్తున ఆయన అభిమానులు వచ్చారు. ఇక యష్ కారు కనిపించగానే చాలా మంది అభిమానులు ఆయన కారును వెంబడించారు. ఈ క్రమంలోనే బళ్లారి జిల్లా సిరగుప్ప పట్టణానికి చెందిన వసంత్ అనే యువకుడి కాలుపై నుంచి..యష్ కాన్వాయ్ వెళ్లడంతో అతనికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన హీరో యష్ అతన్ని స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు.దీంతో తన అభిమానులకు వరస ప్రమాదాలు జరుగుతుండటంతో ఒక్కసారిగా యష్ బాధపడ్డారు. 

ఇటీవలే తన పుట్టినరోజు వేడుకల్లో అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. యష్‌ బర్త్ డే బ్యానర్స్ ఏర్పాటు చేస్తూ..కరెంట్ షాక్ తగిలి ముగ్గురు అభిమానులు మృతి చెందారు. యష్ మృతుల కుటుంబాలను పరామర్శించి..వారి కుటుంబాలకు అండగా ఉంటానని హామీ కూడా ఇచ్చారు. అలాగే, యష్‌ తన ఫ్యాన్స్ కు విజ్ఞప్తి కూడా చేశాడు. 'నాకు పుట్టినరోజు అంటేనే భయం వేస్తుంది. నిజం చెప్పాలంటే అసహ్యమేస్తోంది. మీరు నాకు ప్రేమను ఇస్తే చాలు అదే నాకు నిజమైన పుట్టినరోజు. ఈ బ్యానర్లు కట్టి హంగామా చేయడం నాకు ఇష్టముండదు. అలా చేసేవారికి ఏదైనా జరిగితే ఆ కుటుంబాలకు ఎవరు దిక్కు? అంటూ వేడుకున్నారు. ఈ ఘటన మరువకముందే అలాంటి ప్రమాదమే ఇవాళ చోటుచేసుకోవడంతో యష్ ఎంతోగానో బాధపడుతున్నట్లు సమాచారం. 

ప్రస్తుతం యష్ ‘టాక్సిక్’ సినిమాలో నటిస్తున్నాడు. యష్ కెరిర్ లో 19వ సినిమాగా రాబోతుండటంతో..ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కేవీఎన్ సంస్థ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్(Geethu Mohandas) డైరెక్ట్ చేయబోతున్నారు. ఇక రెగ్యులర్ షూటింగ్ మొదలుకానీ ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసేశారు మేకర్స్. ఈ సినిమా 2025 ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది.