ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఇద్దరు పిల్లలు సహా డాక్టర్ మృతి

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఇద్దరు పిల్లలు సహా డాక్టర్ మృతి
  • డాక్టర్ భార్య, తల్లిని కాపాడిన రెస్క్యూ టీమ్

తిరుపతి జిల్లా: రేణిగుంటలోని బిస్మిల్లా నగర్ లోని రాజరాజేశ్వరి గుడి ఎదురుగా  ప్రైవేట్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ  ప్రమాదంలో డాక్టర్ రవిశంకర్ రెడ్డితోపాటు ఆయన ఇద్దరు పిల్లలు చనిపోయారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, ఫైర్ రెస్క్యూ టీమ్ డాక్టర్ భార్య, తల్లిని కాపాడారు. డాక్టర్ రవిశంకర్ తో పాటు అతని పిల్లలు సిదార్థ రెడ్డి, కార్తీక  ప్రమాదంలో చనిపోయారు. 

తెల్లవారుజామున 4 గంటల సమయంలో మంటలు చెలరేగినట్లు స్థానికులు చెబుతున్నారు. రేడియాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ రెడ్డి, ఆయన భార్య ఫిజియో, షుగర్ వ్యాధి నిపుణురాలు డాక్టర్ అనంతలక్ష్మి బిల్డింగ్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో కార్తిక పేరుతో క్లినిక్ నడుపుతూ మరో ఫ్లోర్ లో నివాసం ఉంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

డాక్టర్ రవిశంకర్ రెడ్డి, ఆయన భార్య అనంతలక్ష్మి,  పిల్లలు సిద్దార్థ రెడ్డి (12), కార్తీక(6) తోపాటు డాక్టర్ తల్లి కూడా మంటల్లో చిక్కుకున్నట్లు గుర్తించి కాపాడేందుకు తీవ్రంగా శ్రమించారు.  సుమారు రెండు గంటల తర్వాత ఇద్దరు పిల్లలను రెస్క్యూ టీమ్ బయటకు తీసింది. పిల్లల్ని 108లో హాస్పిటల్ కు తరలించగా ప్రయోజనం లేకపోయింది. చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. డాక్టర్ భార్య అనంత లక్ష్మితో పాటు, డాక్టర్ తల్లిని రెస్క్యూ టీమ్ రక్షించింది. వీరిద్దరూ స్వల్ప గాయాలతో బయట పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో డాక్టర్ రవిశంకర్ రెడ్డి కూడా మృతి చెందినట్లు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.