సింగరేణిలో ఉద్యోగాల పేరిట మోసాలు

సింగరేణిలో ఉద్యోగాల పేరిట మోసాలు

సింగరేణిలో ఉద్యోగాల పేరిట మోసాలు
డబ్బులు వసూలు చేసిన ముఠా  సభ్యున్ని పట్టుకున్న బాధితులు
సీనియర్​ ఆఫీసర్ల పేరుతో పైరవీల దందా

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని,  ట్రాన్స్​ఫర్ ​చేయిస్తామని ఎంప్లాయీస్​ను, నిరుద్యోగులను మోసగించిన ముఠా గుట్టురట్టయ్యింది. శుక్రవారం రాత్రి సింగరేణి హెడ్​ క్వార్టర్​కు వచ్చిన ఈ ముఠాకు చెందిన వ్యక్తిని బాధితులు పట్టుకుని తమ దగ్గర వసూలు చేసి డబ్బులు వాపసు ఇవ్వాలని నిలదీశారు. గోదావరిఖనికి చెందిన జి. రోహిత్​ అనే వ్యక్తి మరో ఐదుగురితో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు. ఇందులో ఒక యువతి కూడా ఉంది. ఎమ్మెల్సీ కవిత నిర్వహిస్తున్న జాగృతి సంస్థలో వివిధ హోదాల్లో పని చేసిన రోహిత్​ సింగరేణిలో ఉన్నతాధికారులతో సంబంధాలున్నాయని, సంస్థలో ఏ పనైనా చిటికెలో చేస్తామంటూ అమాయకులను నమ్మించారు. వీరికి కొందరు యూనియన్​ నేతలతోనూ సంబంధాలున్నట్టు తెలుస్తోంది.

ఈ ముఠా సభ్యులు తరచూ కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్​కు వస్తూ  పైరవీలు చేస్తున్నారు.  రోహిత్​ ముఠా కొత్తగూడెంలోని ఓ యువకుడికి  ఫిట్టర్​ బేస్​గా ఉద్యోగం ఇప్పిస్తామని ఏడాది కింద  రూ. 15లక్షలకు ఒప్పందం చేసుకుని,  రూ. 2లక్షలు అడ్వాన్స్​గా తీసుకుంది. మరో  మహిళ కొడుకుకు  ఉద్యోగం ఇప్పిస్తామంటూ రూ. 15లక్షలకు ఒప్పందం చేసుకొని ఏడాదిన్నరలో  మూడు విడతల్లో రూ. 7లక్షలు, మరో యువకుడి నుంచి రూ .15 లక్షలు తీసుకున్నారు. కొత్తగూడెం, భూపాలపల్లి, మందమర్రి, గోదావరిఖని, శ్రీరాంపూర్ తదితర ప్రాంతాల్లో ఉద్యోగాలు, ట్రాన్స్​ఫర్​, మెడికల్​ బోర్డు పేర రూ.కోట్లలో వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి.  

రోహిత్​తో పాటు ఒక  యువతి హెడ్డాఫీస్​లో తరచూ  జీఎం పర్సనల్​, జీఎం వెల్ఫేర్​ను  కలుస్తూ నిరుద్యోగులను నమ్మించారు. సింగరేణికి చెందిన పలువురు సీనియర్​ ఆఫీసర్ల  సంతకాలను ఫోర్జరీ చేసి నిరుద్యోగులను మోసగించినట్టు  తెలుస్తోంది. గోదావరిఖని ఏరియాకు చెందిన ఓ కార్మికుడికి మెడికల్​ ఫిట్​నెస్​  ఇప్పించేందుకు శుక్రవారం సింగరేణి హెడ్డాఫీస్​కు వచ్చిన రోహిత్​ను బాధితులు పట్టుకున్నారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీశారు. గోదావరిఖని నుంచి వచ్చిన రోహిత్​ సంబంధీకులు  బాధితులతో మాట్లాడుతున్నారు. తమను మోసగించి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోతే కేసు పెడతామని బాధితులు చెప్తున్నారు.