ముగిసిన బండి సంజయ్ పాదయాత్ర

ముగిసిన బండి సంజయ్ పాదయాత్ర

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడోవిడత పాదయాత్ర హన్మకొండ జిల్లాలో ముగిసింది. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర బండి సంజయ్ కు డప్పు చప్పుళ్ళు, డోలు వాయిద్యాలతో బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పాదయాత్రలో సంజయ్ ను బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ కలిసి సంఘీభావం తెలిపారు. 30మంది NRI గ్రాడ్యుయేట్ విద్యార్థులు సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఉదయం మామునూరు నుంచి మొదలైన పాదయాత్ర తిమ్మాపూర్ క్రాస్ రోడ్, నాయుడు పంప్ చౌరస్తా, రంగశాయిపేట, గవిచర్ల క్రాస్ రోడ్, శంభునిపేట, మిల్స్ బజార్ మీదుగా ఎంజీఎం జంక్షన్ చేరుకుంది.

మధ్యాహ్నం భద్రకాళి ఆలయంలో పూజల తర్వాత పాదయాత్ర ముగింపు సభలో సంజయ్ పాల్గొంటారు. మరోవైపు హన్మకొండ బీజేపీ బహిరంగ సభలో పాల్గొనేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా చేరుకున్నారు. సాయంత్రం శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో జేపీ నడ్డాను సినీ హీరో నితిన్ కలువనున్నారు. ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి అమిత్ షా.. స్టార్ హీరో ఎన్టీఆర్ తో  భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని సంతరించుకుంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన సినీ హీరో నితిన్ తో జాతీయ పార్టీ అధ్యక్షుడు సమావేశం అవుతుండడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.