- రైల్వే అండర్ బ్రిడ్జి శంకుస్థాపన రసాభాస
అల్వాల్, వెలుగు: అల్వాల్ మచ్చ బొల్లారంలో రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన కార్యక్రమం రసాభాసగా మారింది. అల్వాల్ నుంచి బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ మధ్య జనప్రియ అపార్ట్మెంట్స్ సమీపంలో రూ.6.6 కోట్లతో చేపట్టిన రైల్వే అండర్ బ్రిడ్జి నెం.739 అదనపు వెంట్ నిర్మాణ పనులకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరై శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా నిధులు తామే తీసుకువచ్చామంటే..కాదు తాము తీసుకువచ్చామంటూ బీజేపీ, బీఆర్ఎస్ నేతలు వాదులాడుకున్నారు. అలాగే, శంకుస్థాపన దగ్గర ఏర్పాటు చేసిన బ్యానర్లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఫొటో పెట్టలేదని బీఆర్ఎస్ లీడర్లు గొడవకు దిగారు. ఒకరికొకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.
దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ సందర్భంగా రైల్వే అధికారులు ప్రొటోకాల్ పాటించాలని, ఇనాగ్రేషన్ బ్యాక్డ్రాప్లో ప్రధాని, ముఖ్యమంత్రి ఫొటోలు ఉంచాలని, స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వాలని సూచించారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.
