
రేవల్లి, వెలుగు : నాటు సారా తాగి ఓ వ్యక్తి చనిపోయాడు. రేవల్లి మండలం చీర్కపల్లి గ్రామానికి చెందిన ఎరుకలి కోనేరు పోషన్న (52), కలిమొల్ల సూరయ్య కలిసి బుధవారం తలుపునూరు తండాకు వెళ్లి నాటు సారా తాగారు. అనంతరం చెన్నారం శివారులో కుందేల వేటకు వెళ్లారు. పోషన్నకు మత్తు ఎక్కువ కావడంతో అక్కడే పడుకోగా సూరయ్య అతడిని విడిచి గ్రామానికి వచ్చాడు.
పోషన్న ఇంటికి రాకపోవడంతో అతడి కుమారుడు ఎల్లస్వామి గొల్లపల్లి, చెన్నారం గ్రామ శివార్లలో వెతుకుతుండగా గురువారం ఉదయం చెన్నారం శివారులోని చంద్ర గట్టు వద్ద పోషన్న డెడ్బాడీ కనిపించింది. మృతుడి కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు రేవల్లి ఎస్సై తిరుపతిరెడ్డి చెప్పారు.